ఐపీఎల్ లో అగ్రెసివ్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన గౌతం గంభీర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తాను ఐపీఎల్ లో ఆడినప్పుడు విరాట్ కోహ్లీతో పాటు ఇతర ప్లేయర్లతో వాదులాడుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ గంభీర్.. కోహ్లీ ఆట మీద ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఇక ధోని మీదా సరేసరి.
గంభీర్.. ఐపీఎల్ లో ఈ ఇద్దరూ (ధోని, కోహ్లీ) ప్రత్యర్థులుగా ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ కు సారథిగా ఉండేవాడు. అయితే ఎన్ని విభేదలున్నా.. ఎంత గొడవలు పడ్డా వీరిలో ఎవరూ కూడా తనను భయపెట్టలేదని.. కానీ నిద్రలేని రాత్రులు గడిపింది మాత్రం ప్రస్తుత టీమిండియా కెప్టెన్ , ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ వల్లే నని తెలిపాడు.
ఆస్క్ స్టార్ అని ట్విటర్ లో అభిమానులతో సంభాషించిన గంభీర్ ను ‘మీరు ఇతడి వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని ఎప్పుడైనా అనుకున్నారా..?’ అని ఫ్యాన్స్ అడిగారు. దానికి గంభీర్ స్పందిస్తూ.. ‘రోహిత్ శర్మ. అతడొక్కడి వల్లే నేను నిద్రలేని రాత్రులు గడిపా..’అని చెప్పాడు.
తాను కేకేఆర్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ జట్టులో రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉంటే బాగుండేదని, తమ జట్టు మరిన్ని ట్రోఫీలు గెలిచేదని గంభీర్ చెప్పాడు. ‘కేకేఆర్ లో రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉంటే బాగుండేదని నేను అనుకునేవాడిని. ఒకవేళ వాళ్లు గనక నా టీమ్ లో ఉండి ఉంటే మేం ఐపీఎల్ లో మరిన్ని టైటిళ్లు సాధించేవాళ్లం..’ అని తెలిపాడు.
ఐపీఎల్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ నెగ్గగా ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు ట్రోఫీలను గెలుచుకుంది. గంభీర్ కెప్టెన్సీలోని కేకేఆర్.. 2012, 2014లలో ట్రోఫీలను గెలుచుకుంది. గంభీర్ సారథ్యంలో కేకేఆర్.. 122 మ్యాచ్ లలో 69 విజయాలు సాధించింది.
గంభీర్ తర్వాత కేకేఆర్ కు దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ లు సారథులుగా వ్యవహరించారు. ఈ ఇద్దరూ గంభీర్ వారసత్వాన్ని కొనసాగించడంలో విఫలమయ్యారు. గత సీజన్ లో కేకేఆర్ శ్రేయాస్ అయ్యర్ ను సారథిగా నియమించుకుంది. అతడు కూడా 2022లో ఆ జట్టు తలరాతను మార్చలేదు. ఈ సీజన్ లో అయినా అయ్యర్ అండ్ కో. కేకేఆర్ కు ట్రోఫీని అందిస్తారో లేదో వేచి చూడాలి.