ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే వరల్డ్ కప్లో తనను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం వెనుక ఎమ్మెస్కే ప్రసాద్ హస్తమున్నదని.. ఆయన కక్షగట్టి తనను వన్డే వరల్డ్ కప్ జట్టులోకి రాకుండా అడ్డుకున్నాడని వ్యాఖ్యానించిన అంబటి రాయుడుకు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కౌంటర్ ఇచ్చాడు.
రాయుడు చేసిన ఆరోపణలపై తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ టైమ్స్ నౌతో మాట్లాడుతూ... ‘సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు (నలగురు సెలక్టర్లు, ఒక చీఫ్ సెలక్టర్) ఉంటారన్న సంగతి మనందరికీ తెలుసు. కెప్టెన్ కూడా సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతాడు. ఇక్కడ ఏ ఒక్కరి నిర్ణయమో ఫైనల్ కాదు.
సెలక్షన్ కమిటీలో తీసుకునే ప్రతీ నిర్ణయమూ ఎంతో జాగ్రత్తగా.. సమిష్టిగా తీసుకునేది. ఒకవేళ ఒక చీఫ్ సెలక్టర్ మాత్రమే తీసుకునే నిర్ణయమే అయితే ఇంతమంది ఎందుకు..? అక్కడ తీసుకునేది ప్రతీదీ సమిష్టి నిర్ణయమే. నేను ఏదైనా ప్రతిపాదించినా దానికి అందరి ఆమోదయోగ్యం ఉండాలిగా. వ్యక్తిగత నిర్ణయాలు, ఒకరిమీద పగతో ఎంపికచేయకపోవడాలూ హైలెవల్ లో ఉండవు..
రాయుడు వన్డే వరల్డ్ కప్ కంటే ముందే ఇంటర్నేషనల్ లెవల్ లో కొన్ని మ్యాచ్ లు ఆడాడు. మరి అప్పుడు లేని విబేధాలు ఇప్పుడెందుకు వచ్చాయి. నేను ఒక్కటే విషయం క్లీయర్ గా చెప్పదలుచుకున్నా. సెలక్షన్ కమిటీలో తీసుకునే ఏ నిర్ణయమైనా కలెక్టివ్ గా తీసుకునేదే....’అని స్పష్టం చేశాడు.
కాగా 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథిగా వ్యవహరించాడు. 2018లో ధోనీ తప్పుకున్నాక జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. రాయుడు స్థానంలో భారత జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను జట్టులోకి తీసుకుంది. దీనిపై గతంలో రాయుడు ట్విటర్ వేదికగా.. ‘వన్డే వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ పెట్టా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అప్పట్లో పెను దుమారం క్రియేట్ చేసింది.
‘2019 వన్డే వరల్డ్ కప్లో నన్ను సెలక్షన్ చేయకపోవడానికి చాలా పెద్ద కుట్రే ఉంది. సెలక్షన్ కమిటీలో ఉన్నవారికి, నాకూ మధ్య కెరీర్ మొదట్లో కొన్ని గొడవలు ఉండేవి. వాటిని మనసులో పెట్టుకుని సమయం దొరికినప్పుడు ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు. పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అది క్లబ్ మ్యాచో, లేక ఐపీఎల్ మ్యాచో కాదు కదా. వన్డే వరల్డ్ కప్.. దేశం పరువు’ అని ఓ టీవీ ఛానెల్ వేదికగా వ్యాఖ్యానించాడు.