The Elephant Whisperers
కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమంలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అత్యున్నత పురస్కారం గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్ ను చెన్నై సూపర్ కింగ్స్ సారథి అభినందించారు. వారికి స్పెషల్ గిఫ్ట్స్ను అందజేశాడు.
కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ‘ది ఎలిఫెంట్ విస్పర్స్ ’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. హాల్ అవుట్, హౌ డూ యు పర్స్ ఎ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ వంటి ఇతర నామినీలతో పోటీ పడింది.
భారత్ తరఫున ఆస్కార్ గెలుచుకున్న ఫస్ట్ డాక్యుమెంటరీ కూడా ఇదే. ఈ చిత్రంలో కనిపించిన బొమ్మన్, బెల్లి, కార్తీకి గొన్సాల్వేస్ లను చెన్నై టీమ్ సత్కరించింది. ఐపీఎల్-16లో భాగంగా మంగళవారం ధోని.. ఆస్కార్ విజేతలను కలిశాడు.
సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఆస్కార్ విజేతలను ధోని వద్దకు తీసుకుని వారికి అతడిని పరిచయం చేశాడు. బొమ్మన్, బెల్లిలతో పాటు కార్తీకి గొన్సాల్వేస్ లకు తాము ట్రిబ్యూట్ ఇచ్చేందుకు వారిని తీసుకొచ్చామని విశ్వనాథన్ వెల్లడించాడు.
ఆస్కార్ విజేతలతో ఆప్యాయంగా మాట్లాడిన ధోని తన జెర్సీ (7) నెంబర్ ఉండి బొమ్మన్, బెల్లీ, గొన్సాల్వేజ్ పేర్లు ఉన్న జెర్సీలను వారికి అందజేశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రానికి పనిచేసిన టీమ్ పై ఇదివరకే ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.