IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !

Published : May 15, 2026, 07:00 AM IST

MI vs PBKS : ఐపీఎల్ 2026లో తిలక్ వర్మ వీరవిహారం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌ను గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ టీమ్ ప్లేఆఫ్ అవకాశాల పై దెబ్బపడింది.

PREV
16
ముంబై ఇండియన్స్ మాస్ విక్టరీ.. ధర్మశాలలో తిలక్ విధ్వంసం

ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ 58వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ ఉంచిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. పంజాబ్ బౌలర్లను తిలక్ వర్మ ఓ ఆటాడుకోవడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో తిలక్ చేసిన విధ్వంసం అభిమానులకు పూనకాలు తెప్పించింది.

26
పంజాబ్ భారీ స్కోరు.. ఒమర్జాయ్ మెరుపులు

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఒక దశలో పంజాబ్ 170-180 పరుగులకే పరిమితమవుతుందని భావించినా, అజ్మతుల్లా ఒమర్జాయ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశాడు. అయితే చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు పుంజుకోవడంతో ముంబై ముందు భారీ టార్గెట్ నిలిచింది.

36
ర్యాన్ రికెల్టన్, రోహిత్ దూకుడు

201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (48) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు రోహిత్ శర్మ (25) కూడా ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే, ఒకేసారి మూడు వికెట్లు కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. రోహిత్‌ను యజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి స్కోరు 88/3గా ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.

46
తిలక్ వర్మ మాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు

క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తిలక్ వర్మ ఎక్కడా తగ్గలేదు. ఒత్తిడిలో కూడా అద్భుతమైన షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే తిలక్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాహల్ ఓవర్లో 106 మీటర్ల భారీ సిక్సర్ బాదడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే రూథర్‌ఫోర్డ్ ఔటైనా, తిలక్ మాత్రం పట్టు వదలకుండా సునామీ రేపాడు.

56
చివరి 3 ఓవర్ల డ్రామా.. ముంబై సంచలనం

చివరి 18 బంతుల్లో ముంబై గెలవడానికి 50 పరుగులు కావాలి. అసాధ్యం అనుకున్న ఈ లక్ష్యాన్ని తిలక్ తన బ్యాటింగ్‌తో సుసాధ్యం చేశాడు. మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్లో తిలక్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా, విల్ జాక్స్ ఒక సిక్సర్ బాదాడు. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదిన తిలక్ వర్మ, ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు.

66
బూమ్రా కెప్టెన్సీలో అదిరిపోయే బోణీ

ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన జస్ప్రీత్ బూమ్రాకు ఇది మంచి ఆరంభం. మ్యాచ్ అనంతరం బూమ్రా మాట్లాడుతూ.. తిలక్ వర్మ ఇన్నింగ్స్ అద్భుతమని, తన మీద తనకు ఉన్న నమ్మకమే ఈ విజయాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడాడు. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది. పంజాబ్ వరుసగా ఐదో ఓటమిని చవిచూడటంతో వారి ప్లేఆఫ్ అవకాశాల పై దెబ్బపడింది.

Read more Photos on
click me!

Recommended Stories