కెఎల్ రాహుల్ క్లాస్ సెంచరీ... తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా టీమిండియా...

First Published Aug 12, 2021, 11:05 PM IST

లార్డ్స్ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులు చేసి సెంచరీ ముంగిట పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ క్లాస్ సెంచరీతో అదరగొట్టాడు. 

212 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 102 పరుగులు చేసిన కెఎల్ రాహుల్... టెస్టుల్లో ఆరో సెంచరీని నమోదుచేశాడు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్...

1952లో వినూ మన్కడ్, 1990లో రవిశాస్త్రి ఓపెనర్‌గా వచ్చి లార్డ్స్‌లో సెంచరీ నమోదుచేశారు. కెఎల్ రాహుల్‌కి ఇంగ్లాండ్‌పై ఇది మూడో టెస్టు సెంచరీ కావడం మరో విశేషం...

2016 తర్వాత విదేశాల్లో మూడు సెంచరీలు చేసిన ఏకైక భారత ఓపెనర్‌గా కెఎల్ రాహుల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు... శిఖర్ ధావన్, శ్రీలంకలో రెండు సెంచరీలు చేశాడు...

అంతకుముందు 145 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 83 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు... తొలి వికెట్‌కి కెఎల్ రాహుల్‌తో కలిసి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ...

2002లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో సిక్సర్ బాదిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ... లార్డ్స్‌లో ఇంతకుముందు కపిల్‌దేవ్, సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా, అజింకా రహానే టెస్టుల్లో సిక్స్ బాదారు...

టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన రెండో భారత జోడిగా నిలిచారు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ. ఇంతకుముందు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే మూడు ఫార్మాట్లలో తొలి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు...

రోహిత్ శర్మ అవుటైన తర్వాత 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

150 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 80 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది టీమిండియా...

click me!