ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభానికి ముందే నాలుగు సార్లు టోర్నీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తాకింది. ఆ జట్టు కీలక ఆటగాడు, గత సీజన్ లో చెన్నై బౌలింగ్ దళాన్ని నడిపించిన ముఖేష్ చౌదరి.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
గతేడాది దీపక్ చహర్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన చౌదరి.. ఆ సీజన్ లో అదరగొట్టాడు. గత ఎడిషన్ లో ముఖేష్.. 13 మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడ. ఒక మ్యాచ్ లో నాలుగు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. ధోని అండగా చెలరేగిన ఈ పేసర్ తాజా సీజన్ కు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానాన్ని యువ బౌలర్ ఆకాశ్ సింగ్ భర్తీ చేయనున్నాడు.
ఇదే విషయమై సీఎస్కే ఓ ప్రకటనలో.. ‘ముఖేష్ చౌదరి గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నాడు. అతడి స్థానాన్ని లెఫ్టార్ట్ పేసర్ ఆకాశ్ సింగ్ భర్తీ చేయనున్నాడు..’అని తెలిపింది. ఆకాశ్.. గతేడాది భారత జట్టు అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.
గతంలో రాజస్తాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆకాశ్.. దేశవాళీ క్రికెట్ లో నాగాలాండ్ టీమ్ కు ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో పది వికెట్లు పడగొట్టాడు. తొమ్మిది టీ20లు ఆడి ఏడు వికెట్లు తీశాడు.
కాగా చెన్నైకి వరుసగా షాకులు తాకుతూనే ఉన్నాయి. సీజన్ కు కొద్దిరోజుల ముందే న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ కూడా గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సీఎస్కే.. దక్షిణాఫ్రికా బౌలర్ మగలను భర్తీ చేసుకుంది.
నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే తొలిమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. టోర్నమెంట్ ఓపెనర్ గా జరుగబోయే ఈ మ్యాచ్ కు సీఎస్కే సారథి ధోని కూడా అందుబాటులో ఉండడని నిన్న వార్తలు వచ్చినా దానిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఖండించాడు. గుజరాత్ తో మ్యాచ్ లో ధోని ఆడతాడని స్పష్టం చేశాడు.