12 ఏళ్ల 284 రోజుల వయస్సులో బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశారు. దీంతో, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్లను అధిగమించి, రంజీ ట్రోఫీలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఇక 2024 అక్టోబరులో ఆసీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో, వైభవ్ 58 బంతుల్లో శతకం సాధించి సంచలనం రేపాడు. భారత అండర్-19 క్రికెట్లో వేగవంతమైన శతకంగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది.
అదే ఏడాది అక్టోబర్లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులో వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్తో అండర్-19 టెస్టు క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. అలాగే, వైభవ్ అండర్-19 ఆసియా కప్లో శ్రీలంకపై సెమీఫైనల్లో 67 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.
అతని అద్భుతమైన ఆటతో ఐపీఎల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. 2025 ఐపీఎల్ వేలంలో వైభవ్ పేరు ₹30 లక్షల బేస్ ప్రైస్తో నమోదైంది. అయితే, అతని కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ కూడా నడిచింది. అయితే, చివరకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ రూ. 1.1 కోట్లకు దక్కించుకుంది.
2024 నవంబరులో 13 ఏళ్ల వయస్సులో రాజస్థాన్ రాయల్స్తో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన తర్వాత వైభవ్ ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా మాత్రమే కాకుండా, లీగ్ కంటే చిన్న వయసులో కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పుడు రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ మార్గదర్శకులతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాడు.
వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్కు గొప్ప ఆస్తి అవుతాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే, అతని ప్రయాణం యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చేలా ఉందని పేర్కొంటున్నారు.