భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చినప్పుడే కొత్త వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం వెతుకులాట మొదలెట్టింది భారత జట్టు...
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్కి వరుస అవకాశాలు ఇచ్చినా, అతను వాటిని సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఈ దశలో కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్కి కూడా కొన్ని అవకాశాలిచ్చి చూశారు సెలక్టర్లు...
వచ్చిన అరకోర అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సంజూ శాంసన్ విఫలమయ్యాడు. క్రీజులోకి వస్తూనే దూకుడుగా ఆడాలని ప్రయత్నించి, పెవిలియన్ చేరేవాడు...
టీమిండియా తరుపున మొత్తంగా 10 టీ20 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, 11.70 సగటుతో 117 పరుగులు చేశాడు. ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడి 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...
అయితే వరుసగా విఫలం అవుతున్న శ్రేయాస్ అయ్యర్కి అవకాశాలు ఇస్తూ, సంజూ శాంసన్కి చోటు ఇవ్వకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...
ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా వ్యవహరించిన సంజూ శాంసన్, మంచి పరిణితితో బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు...
ఐపీఎల్ 2021 సీజన్లో 14 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 484 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 119 పరుగులు చేసి, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు సంజూ శాంసన్...
ఇందులో రాజస్థాన్ రాయల్స్ ఓడిన మ్యాచుల్లో 358 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఒంటరి పోరాట యోధుడిగా కనిపించాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సమయంలో సంజూని, యూఏఈలోనే ఉండాల్సిందిగా కోరింది బీసీసీఐ...
గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్లో 8 మ్యాచులు ఆడినా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు... అయినా అతనికి టీ20, టెస్టు జట్లలో చోటు దక్కింది...
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో సంజూ శాంసన్కి అవకాశం వచ్చింది. అయితే దాన్ని సంజూ సరిగా వాడుకోలేకపోయాడు. మూడు మ్యాచుల్లో కలిపి 34 పరుగులే చేయగలిగాడు...
అయితే రిషబ్ పంత్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత రిషబ్ పంత్ ఆటతీరులో మార్పు వచ్చింది. నిలకడగా రాణిస్తూ, జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు పంత్...
అలాగే ఎంతో టాలెంట్ ఉన్న ప్లేయర్గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంజూ శాంసన్కి కనీసం టెస్టుల్లో అయినా చోటు ఇవ్వకపోవడం... పక్షపాత ధోరణికి ఉదాహరణగా చెబుతున్నారు సౌత్ క్రికెట్ ఫ్యాన్స్..
న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కి రిషబ్ పంత్కి రెస్ట్ ఇచ్చారు. వికెట్ కీపర్లుగా వృద్ధిమాన్ సాహా, శ్రీకర్ భరత్లకు అవకాశం వచ్చింది. తెలుగు కుర్రాడు భరత్ విషయం పక్కనబెడితే సాహా ఏ మాత్రం ఫామ్లో లేడు...
ఫామ్లో లేని వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చే బదులు, సంజూ శాంసన్కి టీమిండియాలో మరో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...