ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మహిళల తొలి టీ20 ప్రపంచకప్ ఎడిషన్ నుంచి మొన్నీమధ్యే ముగిసిన టోర్నీ వరకూ ఆమె పాల్గొంది. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న పెర్రీ తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే మొదలైన తొలి సీజన్ లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. అయితే మ్యాచ్ లు ఓడినా ఆర్సీబీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న ఆ జట్టు హోలీ సంబురాలకు సంబంధించి ట్విటర్, ఇన్స్టాగ్రామ్ లలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపాయి. ముఖ్యంగా మంధానతో పాటు పెర్రీ ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి.
కాగా ఈ సీజన్ లో భాగంగా ఆర్సీబీ నిర్వహించిన ఫోటో షూట్ లో పెర్రీ.. మీకు విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనిలలో ఎవరో ఒకరితో ఓపెనింగ్ చేయాలంటే ఎవరిని ఎంచుకుంటారు..? అని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.
పెర్రీ స్పందిస్తూ... ‘నేను వాళ్లిద్దరినీ ఎంచుకుంటా.. వాళ్లిద్దరూ క్రీజులో బ్యాటింగ్ చేస్తుంటే నాకు బయటనుంచి చూడటం చాలా ఇష్టం.. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయలేను గానీ చూడటమే నాకు చాలా బాగుంటుంది..’అని గడుసు సమాధానం చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక నిన్న ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి హోలీ ఆడిన పెర్రీకి సహచర ఆటగాళ్లు రంగులతో ముంచెత్తారు. తాజాగా పెర్రీ ఇన్స్టా స్టోరీస్ లో.. ‘పూయడమైతే పూశారు గానీ ఇది (రంగు) పోతుందా..? రెండు సార్లు జట్టు కడుక్కున్నా ఈ రంగు పోవడం లేదు. కొంపదీసి ఇది ఇలాగే ఉండిపోదు కదా..’ అని రాసుకొచ్చిన విషయం తెలిసిందే.
కాగా తొలుత ఢిల్లీ, ఆ తర్వాత ముంబై చేతిలో చిత్తుగా ఓడిన బెంగళూరు.. నేటి రాత్రి గుజరాత్ ను ఢీకొనబోతుంది. డబ్ల్యూపీఎల్ లో ఈ రెండు జట్లూ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆర్సీబీ గానీ గుజరాత్ గానీ టోర్నీలో ముందడుగు వేస్తాయి.