2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించి, 1983 తర్వాత వన్డే వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది...
అయితే 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో రెండు సార్లు టాస్ వేశారనే విషయం మీకు తెలుసా? ఫైనల్కి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన జెఫ్ క్రోనీ, అభిమానుల గోల కారణంగా లంక కెప్టెన్ కుమార సంగర్కర ఏం చెప్పాడో వినలేకపోయాడు. కుమార సంగర్కర హెడ్ చెప్పాడు, అదే పడింది కూడా..
టాస్ గెలిచిన కుమార సంగర్కర, బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్టు చెప్పాడు కూడా. అయితే రిఫరీ జెఫ్ క్రోనీ, సంగర్కర ఏం చెప్పాడో వినబడలేదని... మళ్లీ టాస్ వేయాల్సిందిగా సూచించాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ, సంగర్కర ‘టెయిల్’ అని చెప్పినట్టు వినబడిందని చెప్పాడు..
దీంతో రెండోసారి టాస్ వేశారు. అప్పుడు కూడా సంగర్కర హెడ్ అని చెప్పడం, అదే పడడంతో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. మహేళ జయవర్థనే సెంచరీ చేసి నాటౌట్గా నిలవగా కుమార సంగర్కర 48 పరుగులు చేయడంతో శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది..
ఈ లక్ష్యఛేదనలో వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కాగా, సచిన్ టెండూల్కర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్కి 83 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 35 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ కాగా ధోనీ, ఐదో స్థానంలో బ్యాటింగ్కి రావడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలింది..
గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి అవుట్ కాగా ఎమ్మెస్ ధోనీ 91 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ 21 పరుగులు చేశాడు. 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత జట్టు, 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకుంది...