
Champions Trophy 2025 IND vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ పోరుకు అంతా సిద్ధమైంది. ఎనిమిది దేశాల వన్డే టోర్నమెంట్ చివరి సమరంతో విజేతను నిర్ణయించడానికి దుబాయ్ వేదిక రెడీగా ఉంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ - న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్లతో పాటు ప్రభావం చూపగల ఐదు అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాట్ హెన్రీతో న్యూజిలాండ్ అటాక్ మొదలు
న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంటే ముందుగా మ్యాట్ హెన్రీతో భారత్ పై అటాక్ కు దిగుతుంది. ఈ న్యూజిలాండ్ పేస్ బౌలర్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 10 వికెట్లతో బౌలింగ్ చార్టులలో టాప్ లో ఉన్నాడు. ఇంతకుముందు భారత్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో మ్యాట్ హెన్రీ ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.
దుబాయ్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో హెన్రీ భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ తో పాటు విరాట్ కోహ్లీల వికెట్లు తీసుకుని భారత్ ను 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయేలా చేశాడు. అయితే, మిడిల్ ఆర్డర్ ఫైట్బ్యాక్ తో రోహిత్ సేన 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. పేస్, మంచి సీమ్ తో కలిపి బౌలింగ్ చేసే హెన్రీ న్యూజిలాండ్ కు విజయాన్ని అందించడంలో పూర్తిగా సక్సెక్ కాలేకపోయినా భారత్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తన 10 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి భారత్ తో జరిగే ఫైనల్లో మ్యాట్ హెన్రీ ఓపెనింగ్ అటాక్ న్యూజిలాండ్ పైచేయి సాధించడంలో కీలకం కావచ్చు.
వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ తో న్యూజిలాండ్ ను దెబ్బకొడతాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత తుది జట్టులో మణికట్టు మాయాజాల మాంత్రికుడు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆలస్యంగా చేరాడు. కానీ, అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ప్రత్యర్థి జట్టును కోలుకోని దెబ్బకొట్టాడు. ఈ టోర్నీలో వరుణ్ చక్రవర్తికి అది తొలి మ్యాచ్. అలాగే, ఫిబ్రవరిలో ఇంగ్లాండ్పై అరంగేట్రం చేసిన ఈ మిస్టరీ స్పిన్నర్ కు రెండవ వన్డే మాత్రమే.
వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్లో చాలా వైవిధ్యాలు కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్లో కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లకు సహాయపడే దుబాయ్ పిచ్లపై వరుణ్ చక్రవర్తి భారత జట్టులో భాగమైతే కీలకంగా మారవచ్చు.
భారత్ ను బెదిరిస్తున్న రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్
లాహోర్లో దక్షిణాఫ్రికాపై సెంచరీలు బాదిన తర్వాత రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర, అలాగే, రేసు గుర్రంలా రెచ్చిపోయే కేన్ విలియమ్సన్ ను ఫైనల్ పోరులో భారత్ కు చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సెమీ-ఫైనల్లో ఎడమచేతి వాటం బ్యాటర్ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ లు కలిసి 164 పరుగులు జోడించి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీనికి తోడు వీరిద్దరూ భారత స్పిన్నర్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
కేన్ మామ భారత్తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో 81 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రచిన్ రవీంద్ర బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటునే క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ లు ఆడతాడు. కాబట్టి దుబాయ్ స్లో పిచ్ లపై కూడా వీరు భారత్ కు చెమటలు పట్టించే అవకాశముంది. కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ తమ బౌలర్ల పనిని సులభం చేస్తుందని న్యూజిలాండ్ కెప్టెన్, ఎడమచేతి వాటం స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ చెప్పారంటే వారి ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రోహిత్ శర్మ ఆరంభం అదిరితే న్యూజిలాండ్ కు కష్టమే !
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు రోహిత్ శర్మ బ్యాటింగ్ టాప్ గేర్ను అందుకోలేదని చెప్పవచ్చు. బంగ్లాదేశ్పై ఆడిన 41 పరుగులు ఈ టోర్నీలో అతని టాప్ స్కోర్ గా ఉంది. అయితే, పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్లలో తక్కువ పరుగులే చేసినా భారత్ కు మంచి ఆరంభం వచ్చేలా చేసింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ప్రభావం చూపకపోవడంతో విమర్శలు సైతం వస్తున్నాయి. కానీ, కెప్టెన్ భారత జట్టును నడిపించడంలో అతని విజయసూత్రం మెచ్చుకోవాల్సిందే.
అలాగే, రోహిత్ బ్యాటింగ్ టాప్ గేర్ ను అందుకుంటే ఎలా ఉంటుందో అతను సాధించిన వన్డే డబుల్ సెంచరీలే నిదర్శనం. కాబట్టి ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ నుంచి సునామీ ఇన్నింగ్స్ ను ఆశించవచ్చు. అలాగే, కెప్టెన్ గా తక్కువ స్కోర్ ను కూడా కాపాడుకోవడంలో అతని అనుభవం జట్టును విజేతగా నిలిపే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
దుబాయ్ పిచ్ ను తక్కువ అంచనా వేస్తే అంతే సంగతి !
రాజకీయ కారణాల వల్ల పాకిస్తాన్లో పర్యటించడానికి నిరాకరించిన భారత్ తన అన్ని మ్యాచ్ లను దుబాయ్ లో ఆడుతోంది. ఒక జట్టు ఒకే వేదికపై ఆడటంతో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇక్కడి పిచ్ లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇక్కడి స్లో పిచ్ లపై స్పిన్నర్లు చక్రం తిప్పగలరు. అయితే, బౌలర్లకు అనుకూలిస్తున్న ఇక్కడి పిచ్ లపై కొందరు బ్యాటర్లు కూడా రాణిస్తుండటం గమనించాల్సిన అంశం. ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా అత్యధిక స్కోరు 264 పరుగులు నమోదు చేసింది. అయితే, భారత జట్టు ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
ఇక పాకిస్తాన్లోని పిచ్ లపై న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డును నమోదుచేస్తూ 362-6 పరుగులు సాధించింది. లాహోర్లో దక్షిణాఫ్రికాను 312-9కి పరిమితం చేసి విజయాన్ని అందుకుంది. కాబట్టి న్యూజిలాండ్ అలాంటి భారీ స్కోర్ నమోదుచేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ ను ఎదుర్కోవడం న్యూజిలాండ్ కు అంతతేలికైనా విషయం కాదు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో మరో బిగ్ థ్రిల్లింగ్ ఫైట్ పక్కాగా కనిపిస్తోంది !