మారేది క్యాలెండ‌ర్ పేజీ మాత్ర‌మే కాదు, నిబంధ‌న‌లు కూడా.. జూలై 1 నుంచి గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు

Published : Jun 28, 2026, 03:03 PM IST

Rules Change: మ‌రో రెండు రోజుల్లో జూలై ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీలా ఈసారి కూడా పలు కీలక నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ ధరల నుంచి బ్యాంక్ ఎఫ్‌డీలు వరకు అనేక అంశాలు సామాన్యులపై ప్రభావం చూపనున్నాయి.  

PREV
15
ఎల్పీజీ ధరలు, ఆధార్ అప్‌డేట్‌లో కీలక మార్పులు

ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలను బట్టి గృహ, వాణిజ్య గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా తాజా ప్రకటనలు వెలువడే అవకాశముంది.

ఇక ఆధార్ కార్డు కలిగిన వారికి మరో ఊరట లభించనుంది. ఇంతవరకు ఆధార్‌కు ఈమెయిల్ ఐడీ జత చేయడానికి ఫీజు ఉండగా, జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి రుసుము లేకుండానే ఈమెయిల్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

25
UPI ద్వారా PF డబ్బులు.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ EPFO 3.0ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా సభ్యులు తమ పీఎఫ్ డబ్బును నేరుగా UPI ద్వారా వేగంగా ఉపసంహరించుకునే అవకాశం లభించనుంది. దీంతో ప్రక్రియ మరింత సులభం కానుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్ (DA) సమీక్ష కూడా జూలైలో జరగనుంది. దీని ఆధారంగా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది.

35
FD వడ్డీ రేట్లు, క్రెడిట్ కార్డు రివార్డ్స్‌లో మార్పులు

రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన నిర్ణయాల తర్వాత పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. కొత్తగా ఎఫ్‌డీ చేయాలనుకునే వారు లేదా పాత ఎఫ్‌డీని రెన్యూ చేసుకునే వారు తాజా వడ్డీ రేట్లను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది. మరోవైపు కొన్ని ప్రముఖ బ్యాంకులు, ముఖ్యంగా ప్రీమియం క్రెడిట్ కార్డులపై ఇచ్చే రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. రివార్డ్ పాయింట్లకు గరిష్ఠ పరిమితి విధించే అవకాశముందని తెలుస్తోంది.

45
రైల్వే ప్రయాణికులకు కొత్త హెచ్చరిక

భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచే ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి భారీ జరిమానా తప్పకపోవచ్చు.

55
జూలై 1 నుంచి ఇవి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు

జూలై నెల ప్రారంభంతో గ్యాస్ ధరలు, ఆధార్ సేవలు, పీఎఫ్ ఉపసంహరణ, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు, క్రెడిట్ కార్డు రివార్డ్స్, రైల్వే జరిమానాలు వంటి పలు అంశాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిబంధనలను ముందుగానే తెలుసుకుని అవసరమైన నిర్ణయాలు తీసుకుంటే అనవసర ఖర్చులు, ఇబ్బందులను నివారించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories