Gold Price Hike: అంతర్జాతీయ పరిస్థితులు మరోసారి బంగారం మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మరోసారి షాక్ తగిలింది. అయితే ఈ పెరుగుదలకు కారణం దేశీయ మార్కెట్ కాదు... అంతర్జాతీయ పరిస్థితులే.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధరలు బలపడటంతో దేశీయ మార్కెట్లోనూ అదే ప్రభావం కనిపించింది. డాలర్, ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ హెవెన్ ఆస్తిగా భావించి కొనుగోళ్లు పెంచుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బంగారం ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు రిస్కీ ఆస్తుల కంటే సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం సహజం. ఈ నేపథ్యంలో బంగారంపై డిమాండ్ పెరగడంతో వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి.
23
రూ.1,44,330కు చేరిన పసిడి
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,44,330కు చేరుకుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,32,300 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.620 పెరిగి రూ.1,08,250గా నమోదైంది. మరోవైపు వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. కిలో వెండి రూ.2.35 లక్షలు ఉంది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదైనప్పటికీ నేడు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారంతో పోలిస్తే వెండి మార్కెట్లో కొనుగోళ్లు పరిమితంగానే ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
33
నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం
రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ కదలికలు, ముడి చమురు ధరల మార్పులు బంగారం మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పండుగలు, వివాహాల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో డిమాండ్ మరింత పెరిగితే బంగారం ధరలు మరోసారి ఎగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు అంతర్జాతీయ మార్కెట్ ధోరణులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.