ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉంటుందననే చర్చ సాగుతుంది. 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే ఏడాది జనవరి మాసంలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో జనసేన మధ్య పొత్తుంది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్టుగా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించి పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు. తెలుగుదేశం, జనసేన కూటమిలో బారతీయ జనతా పార్టీ చేరుతుందా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.ఈ విషయమై భారతీయ జనతా పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 2024 జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఈ లోపుగానే ఈ విషయమై బీజేపీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత పొత్తుల విషయమై భారతీయ జనతా పార్టీ తేల్చే అవకాశం ఉంది.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులకు జనసేన మద్దతు ప్రకటించింది.ఈ ఎన్నికల సమయంలో జనసేన పోటీ చేయలేదు. ఈ కూటమి అభ్యర్థులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, ఒంటరిగా పోటీ చేశాయి. జనసేన, సీపీఐ, సీపీఐ(ఎం), బీఎస్పీ కలిసి పోటీ చేశాయి.
తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి రావాలనే ఆకాంక్షను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ఈ దిశగా విపక్షాలు కలిసి రావాలని పవన్ కళ్యాణ్ గతంలోనే కోరారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తే ఈ రెండు పార్టీలకు పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు చంద్రబాబుకు కొంత ఇబ్బందేననే చర్చ కూడ లేకపోలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తును బీజేపీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు నేతలు సమర్ధిస్తున్నారు. బీజేపీలో తొలి నుండి నేతలు తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో ఇటీవల చేరిన వారంతా పొత్తును సమర్ధిస్తున్నారనే చర్చ సాగుతుంది.
పొత్తుల అంశం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. రాష్ట్రంలో పరిస్థితిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదికను త్వరలో ఇవ్వనున్నారని సమాచారం.