Pawan Kalyan : ఏడుకొండలవాడా..! క్షమించు - హైందవ జాతికే కళంకం

First Published Sep 21, 2024, 9:41 PM IST

Tirupati Laddoo : తిరుమల తిరుపతి వెంక‌న్న స్వామి ప‌ర‌మ ప‌విత్ర‌ ప్ర‌సాదం లడ్డూలలో చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వుతో సహా జంతువుల కొవ్వును కలపడంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమనీ, ప్రాయశ్చిత్త దీక్ష చేప‌డుతున్న‌ట్టు ప‌వ‌న్ కళ్యాణ్ పేర్కొన్నారు. 
 

pawan kalyan

Tirupati Laddoo : ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం రాజకీయ దుమారం రేపుతోంది. హిందూ వ‌ర్గాల్లో తీవ్ర ఆగ్ర‌హాన్ని రేకెత్తించింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి చుట్టూ వివాదం న‌డుస్తోంది. లడ్డూల త‌యారీలో చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వుతో సహా జంతువుల కొవ్వును కల్తీ చేయడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ప్రభుత్వ హయాంలో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఈ సమస్యకు జవాబుదారీతనం వహించాలని పవన్ అన్నారు. "భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థలందరితో చర్చ జరగాల్సిన అవ‌సరాన్ని నొక్కి చెప్పారు. ఏడుకొండలవాడా..! క్షమించు ఈ విష‌యాన్ని ముందే గుర్తించ‌లేక‌పోయామ‌ని పేర్కొంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షకు దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 
 

Latest Videos


అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం - గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. 

లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు.

"22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. 

భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోందని" పేర్కొన్నారు.

అలాగే, "వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః" అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రోసారి స్పందించారు. 

దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ను ఏర్పాటు చేయాల్సిన అవ‌సరాన్ని అంత‌కుముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. "లడ్డూ" వివాదంపై కఠినమైన చర్యలకు హామీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. "దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతుల" చుట్టూ ఉన్న అనేక సమస్యలను సూచిస్తుంది. తిరుమ‌ల వెంక‌న్న ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపినట్లు గుర్తించినందుకు మనంద‌రినీ తీవ్రంగా కలవరానికి గురిచేసింది. చాలా ప్రశ్నలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిటిడి బోర్డు సమాధానం చెప్పాలి. ఈ విష‌యంలో మా ప్రభుత్వం అన్ని చ‌ర్య‌ల‌కు కట్టుబడి'' ఉందన్నారు. 

"మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైంది" అని ప‌వ‌న్ అన్నారు.

click me!