100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్

First Published Sep 16, 2024, 2:49 PM IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు సాధించారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. గ్రామ పాలనలో ఈ అతిపెద్ద కార్యక్రమం వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తింపు పొందింది

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. 

Pawan Kalyan Sets World Record

ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్ ను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అందజేశారు.

Latest Videos


pawan kalyan

గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలు రాయిని అందుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామ సభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామసభల్లో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు.

Pawan Kalyan

గ్రామ స్వరాజ్యం దిశగా...
గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం కళకళలాడుతుందంటారు జాతిపిత మహాత్మా గాంధీ. ఆ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా అడుగులు వేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల పాలన బలంగా ఉండాలన్నది ఆలోచన. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామస్థులే నిర్ణయించుకునే అధికారం ఉందని, గ్రామసభల్లో చర్చించి తీర్మానం చేసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణుల్లో గ్రామసభల తీరుతెన్నులపై చైతన్యం కలిగించడంలో పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు స్వపరిపాలన, సుపరిపాలన దిశగా అడుగలు వేస్తున్నాయి. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి ‘స్వర్ణ పంచాయతీ’లుగా అభివృద్ధి చెందేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం.   

Pawan Kalyan

ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ గ్రామసభల్లో లక్షలాది గ్రామీణులు, రైతులు, కూలీలు, అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వానపల్లి గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మైసూరవారిపల్లెలో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనులు మీద, వివిధ పథకాలు ఉపయోగించుకొని గ్రామాలు ఎలా అభివృద్ధి బాటలో సాగలన్నదానిపై విస్తృత్తంగా చర్చ జరిగింది. గ్రామసభల్లో ఒకేరోజున రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల పనులను ఆమోదించారు. 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ పనుల వల్ల 9 కోట్ల మందికి ఉపాధి లభించేలా, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామసభల్లో నిర్ణయాలు జరిగాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాం నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేందుకు గ్రామస్థులంతా ఒకేసారి రాష్ట్రంలో ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలను తూతూమంత్రంగా నిర్వహించకుండా గ్రామీణులంతా కలిసి కూర్చొని చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా చైతన్యం కలిగించింది. మహిళలు, యువత గ్రామసభలకు తరలివచ్చి గ్రామానికి ఏమి అవసరమో దానిపై చర్చించి, తీర్మానం చేసేలా ప్రోత్సహించింది. 

Pawan Kalyan

రాష్ట్రమంతటా ఒకేసారి జరిగిన ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం భారతదేశంలోనే జరిగిన అతి పెద్ద గ్రామపాలన కార్యక్రమంగా ప్రపంచ రికార్డులకెక్కింది. ఇదే స్ఫూర్తిని, గ్రామాల భవిష్యత్తు కీర్తిని, కొండంత ఆశయ దీప్తితో ముందుకు తీసుకెళ్లి గ్రామ స్వపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్నదే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

click me!