Pawan Kalyan, Janasena
Jana Sena Annual Meeting: గత దశాబ్దంలో అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడిన పార్టీ జనసేన.. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో అద్భుతమైన విజయంతో యావత్ భారతావని దృష్టిని ఆకర్షించింది. పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న స్థాపించిన ఈ పార్టీ ఇప్పుడు దాని వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. శుక్రవారం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో భారీ ప్లీనరీతో జనసేన పార్టీ తన 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జయకేతనంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో తనను తిట్టని తిట్టు లేదని అన్నారు. అంచుకు కూడా రానివ్వమన్న చోట అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వచ్చామని పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తనను తీవ్రంగా అవమానించారనీ, అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు నడుస్తున్నామని చెప్పారు. గత వైకాపా పాలనను ప్రస్తావిస్తూ.. గత ఐదేండ్లు ఆంధ్రప్రదేశ్ లో హింసను సాగించారనీ, ప్రతిపక్షాలను వేధించారని పేర్కొన్నారు. తనను గత ప్రభుత్వ నాయకులు, వైకాపా నేతలు తిట్టని తిట్టు లేదన్నారు. వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు.
AP Deputy CM Pawan Kalyan, janasena, Pawan Kalyan
అలాగే, తనపై, సనాతనధర్మంపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. తాను మొదటి నుంచి నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాని చెప్పారు. కానీ, చాలా మంది తాను సెక్యులర్ నుంచి సనాతన ధర్మానికి మారిపోయాను అనుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతకాలం క్రితం పాతబస్తీలో ఒక నేత ఒక గంట టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తామనే కామెంట్స్ ను ప్రస్తావిస్తూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే తమకు కోసం రాదా.. మన రాముడి తలను నరికేస్తామంటే మాకు కోపం రావొద్దంటే ఎలా అని ప్రశ్నలు కురిపించారు.
జనసేన జన్మస్థలం తెలంగాణ అయితే కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ కోటీ రతనాల వీణ అంటూ తన ప్రసంగం ముందుకు సాగించిన పవన్.. తెలంగాణ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం ఉందనీ, అక్కడి నుంచి జయకేతనం సభకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.