
Pawan Kalyan : సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాజకీయ అనుభవాన్ని సాధించాక 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించారు... కానీ పాలనలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుతాలు చేస్తున్నారు పవన్. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలనే కాదు డిప్యూటీ సీఎం బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు. తమ మంత్రిత్వ శాఖల విషయంలో పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరికొత్తగా వుంటున్నాయి. ఇంతకు ముందున్నవారు ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు... అని ప్రజలు అనుకునేలా పవన్ కల్యాణ్ నిర్ణయాలుంటున్నాయి.
తాజాగా గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాను గుర్తుచేస్తోంది. ఆ మూవీలో ముఖ్యమంత్రి మహేష్ గ్రామపాలన అనే కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. అంటే ఒక్కో గ్రామ సమస్య ఒక్కోలా వుంటుంది... కాబట్టి తమ గ్రామానికి ఏం కావాలో అక్కడి ప్రజలకే బాగా తెలుస్తుంది... కాబట్టి స్థానిక ప్రజలకే పాలనాపరమైన నిర్ణయాధికారం ఇవ్వాలనేదే ఈ స్థానిక పాలన కాన్సెప్ట్. ఇలా రీల్ సీఎం మహేష్ బాబు పాలనా విధానాన్ని రియల్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారు.
ఇవాళ (సోమవారం) ఉపాధి హామీ పథకం గురించి చర్చించేందుకు మంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో తన ఆలోచనను తెలియజేసారు... ఆయన మాటలు 'భరత్ అనే నేను' సినిమాను గుర్తుచేసాయి.
ఉపాధి హామీ పనులగురించి చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఇలా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఈ నెల(ఆగస్ట్) 23న గ్రామసభలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తమ గ్రామానికి ఏ పనులు అవసరమో అక్కడి ప్రజలకే తెలుస్తుంది... కాబట్టి గ్రామసభలో చర్చించి ఎలా అభివృద్ధి చేసుకోవాలో తీర్మానించుకోవాలని సూచించారు. మీ ఊరికి ఏ పనులు అవసరమో మాట్లాడుకొని తీర్మానించుకొనే అవకాశం ఈ గ్రామసభల ద్వారా లభిస్తుందని పవన్ అన్నారు.
ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని చాలా మంది చెప్పారు... అందుకే ఈ నెల 23న ఒకేసారి ఏర్పాటుచేసామని అన్నారు. కాబట్టి గ్రామంలోని ప్రతి ఒక్కరు గ్రామసభలో పాల్గొని తమ గ్రామాభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్నారు పవన్ కల్యాణ్. గ్రామసభల ద్వారా ఏ పనులకు ఎన్ని నిధులు వచ్చాయి? ఎలా ఖర్చు చేస్తారు? అనే విషయాలు కూడా తెలుస్తాయన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై గ్రామ సభలో చర్చించి ఆమోదం తీసుకుంటామని మంత్రి పవన్ తెలిపారు. పంచాయతీ అధికారులు గ్రామసభల నిర్వహణపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఆదేశించారు. రెండురోజుల ముందే గ్రామసభకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి... సభను అర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ సభలు నిర్వహించడం అవసరం... తద్వారా ప్రజలకు వారి గ్రామాల అభివృద్ధిలో భాగమవుతారని పవన్ అన్నారు.
ఉపాధి హామీ పనులు కూలీలు, రైతులకు ఉపయోగపడేలా... ఉత్పాదకత పెంపొందించేలా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం పనులు నిబద్ధతతో పూర్తి చేయాలన్నారు. ప్రజలకు మేలు చేయాలనే బలమైన సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది...కాబట్టి అవినీతి పాల్పడితే ఏ స్థాయి అధికారినైనా వదలబోమని హెచ్చరించారు. తప్పుచేసే ప్రతి ఒక్కరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం... బాధ్యతయుతంగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు ఎలాంటి అవినీతికి తావులేకుండా వ్యవస్థలన్నీ పటిష్టంగా ఉన్నప్పుడే మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపించడం సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని... ఇప్పుడు ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసి, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల సహాయసహకారాలు అవసరమన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే పథకం అమల్లో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.