హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదును కొన్ని పాలనా వ్యవహారాల కోసం వాడుకోవాలని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ వెసులుబాటును వాడుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి జగన్ హైదరాబాదులో క్యాంప్ ఆఫీసును పెట్టాలని అనుకుంటున్నారు.
undefined
ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.
undefined
ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాదును వాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. అమరావతి పాలనాయంత్రాంగాన్ని తరలించారు. తాను హైదరాబాదు క్యాంప్ ఆఫీసును వాడుకుంటానని, ఎపికి కేటాయించిన సచివాలయంలోని బ్లాకులను వాడుకుంంటామని జగన్ కేసిఆర్ కు చెప్పనట్లు సమాచారం.
undefined
పెండింగులో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి కొంత మంది అధికారులను జగన్ హైదరాబాదులో ఉంచాలని భావిస్తున్నారు. విద్యుత్తు వినియోగం, ఉన్నత విద్య, ఆబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ అధికారులు ఉంటే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని ఉమ్మడి సంస్థలపై తెలంగాణ అధికారులతో వారు చర్చలు జరపడానికి ఇక్కడ ఉంటే సులభమవుతుందని ఆయన భావనగా చెబుతున్నారు.
undefined
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును సిద్దం చేయాలని కేసీఆర్ రాష్ట్రాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదుర్చడానికి జగన్, కేసీఆర్ ప్రయత్నించి, విభజన సమస్యలను పరిష్కరించుకుంటారని అంటున్నారు.
undefined