Nagababu: ఏపీ ప్రభుత్వం కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదాతో కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఛైర్పర్సన్గా నియామితులయ్యారు. కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. 2047 నాటికి 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యంగా పేర్కొంది.
పవన్ కళ్యాణ్ బిగ్ డెసిషన్: అన్న నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. ఆ కీలక శాఖ బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటుచేసుకుంది. జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ సైంటిఫిక్ అండ్ ఎకోలాజికల్ గ్రీనింగ్, రీఫారేస్టేషన్ ప్రాజెక్ట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా నాగబాబును నియమిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారిక ఉత్తర్వులు (G.O. Rt No. 93) జారీ చేసింది. అంతేకాకుండా, ఈ పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ప్రత్యేకంగా కేబినెట్ హోదా ర్యాంకును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ, అటవీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ శాఖ పరిధిలోని ఏపీ గ్రీన్ సొసైటీ గవర్నింగ్ బోర్డు ఛైర్మన్గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తుండగా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యతలను తన సోదరుడైన నాగబాబుకు అప్పగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
24
2047 నాటికి 50 శాతం పచ్చదనమే టార్గెట్
ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు వెనుక ప్రభుత్వం ఒక భారీ విజన్ ప్రణాళికను రూపొందించింది. 2047 నాటికి రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, చెట్ల కవరేజీని ఏకంగా 50 శాతానికి పెంచడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతమున్న పచ్చదనాన్ని రెట్టింపు చేస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఒక శక్తివంతమైన వ్యవస్థాగత యంత్రాంగం అవసరం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చి హరిత కార్యక్రమాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఈ గ్రీన్ సొసైటీ పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
34
ఎన్నికల ప్రయాణం నుండి కేబినెట్ హోదా వరకు నాగబాబు జర్నీ ఇదే
కొణిదెల నాగబాబు పొలిటికల్ జర్నీ వైపు చూస్తే.. ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, ధైర్యం వీడకుండా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, కూటమి విజయం కోసం ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపుతారని లేదా ప్రత్యక్ష మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. అయితే గతేడాది మార్చిలో ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా కేబినెట్ హోదాతో కూడిన పదవి దక్కడంతో జనసేన శ్రేణులు, మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేస్తున్న శాఖ పరిధిలోనే ఆయన సోదరుడికి కేబినెట్ హోదాతో కూడిన కీలక పదవి కేటాయించడంపై పొలిటికల్ సర్కిల్స్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ, పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద పెంపు, ప్లాంటేషన్ డ్రైవ్లను సక్సెస్ చేయడం ఇప్పుడు నాగబాబు ముందున్న ప్రధాన సవాలు. గ్రీన్ మిషన్ ద్వారా రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేలా ఆయన ప్రణాళికలు ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.