ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాష్ట్రంలో ముప్పేట దాడి జరుగుతోంది. జగన్ రాష్ట్రంలో ఇతర పార్టీలు ఏవీ స్నేహవూర్వక సంబంధాలను కొనసాగించడం లేదు. వైఎస్ జగన్ బిజెపికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్రంతో ఆయన స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో జగన్ పడ్డారు. తాజాగా అంతర్వేద రథం కాల్చివేత ఘటనతో బిజెపి జగన్ ప్రభుత్వంపై రాజకీయ సమరం సాగిస్తోంది.
undefined
సోము వీర్రాజు బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ మీద పోరును ఉధృతం చేసినట్లు కనిపిస్తున్నారు. బుధవారం చలో అంతర్వేది కార్యక్రమం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయడానికి ఆయన ప్రయత్నించారు. పోలీసులు చివరకు సోము వీర్రాజును అంతర్వేదికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. బిజెపి జగన్ మీద హిందూత్వ కార్డును బలంగా ప్రయోగించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
undefined
వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను, బిజెపిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిస్థితి ఒక రకంగానూ అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగానూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధించడం సులభం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మేరకు ఆత్మరక్షణ చేసుకుంటూనే ప్రతిపక్షాలను తిప్పికొట్టాల్సి ఉంటుంది. ఇందుకు వైఎస్ జగన్ పక్కా పథక రచనతోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు.
undefined
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై, ఆరోపణలపై వైఎస్ జగన్ నోరు మెదపడం లేదు. తానుగా ప్రతిపక్షాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు. అబివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నిస్తూనే ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు తనదైన జట్టును ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. శిరోముండన సంఘటన విషయంలో ఆయన ప్రతిస్పందించారు. అది సున్నితమైన అంశం కావడంతో, దళితులకు సంబంధించిన అంశం కావడంతో ఆయన స్పందించినట్లు కనిపిస్తున్నారు.
undefined
ఏ శాఖకు సంబంధించిన సమస్య ముందుకు వస్తే ఆ శాఖకు సంబంధించి మంత్రి స్పందించే విధంగా ఏర్పాటు చేసినట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే అంతర్వేది ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుపై, పవన్ కల్యాణ్ మీద, సోము వీర్రాజుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్షాలను ఎదుర్కునే జగన్ జట్టులో వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యమైనవారు.
undefined
ప్రతిపక్షాలను తిప్పికొట్టే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్న మరో మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖపట్నం సమస్యల మీదనే కాకుండా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సమస్యల మీద ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం విషయంలో చంద్రబాబును ఎదుర్కోవడంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. రమేష్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రమేష్ కు మద్దతుగా వచ్చిన హీరో రామ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
undefined
జగన్ కీలకమైన మంత్రుల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. అమరావతి వివాదంపైనా, ఇళ్ల స్థలాల పంపిణీపైనా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడంలో ఆయన తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా ఆయన బలమైన గొంతును వినిపిస్తూ చంద్రబాబు విమర్శలను తిప్పికొడుతున్నారు.
undefined
జగన్ కు మద్దతుగా బలమైన గొంతుగా మంత్రి కొడాలి నాని కనిపిస్తున్నారు. తన నోటి దురుసుతో ప్రతిపక్షాలను బెంబేలెత్తించే లక్షణం ఆయనకు ఉంది. చంద్రబాబుపై, నారా లోకేష్ మీద ఆయన మాటలు చాలా సార్లు హద్దులు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు.
undefined
రోజా సరేసరి... మొదటి నుంచి ఆమె వైఎస్ జగన్ కు మద్దతుగా నిలబడుతున్నారు. తన నియోజకవర్గంతో సంబంధం లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద ఆమె వాగ్బాణాలు సంధించడంలో ఆరితేరినట్లు వ్యవహరిస్తున్నారు. రోజా నోటికి తాళం వేయడానికి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. వాటన్నింటినీ ఎదుర్కుంటూ ఆమె ముందుకు వచ్చారు.
undefined
జగన్ కు అత్యంత సన్నిహితుడు, జగన్ కోర్ టీమ్ సభ్యుడు పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి. ఆయన ప్రతిరోజూ ఏదో విధంగా చంద్రబాబుపైనా, నారా లోకేష్ మీద తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు వేస్తూ వస్తున్నారు. తన వ్యంగ్యాస్త్రాలకు ట్విట్టర్ ను ఆయన వేదికగా చేసుకున్నారు. కీలకమైన వ్యూహకర్త కూడా ఆయనే. విజయసాయి రెడ్డి ప్రమేయం లేకుండా జగన్ ముందుకు కదలరనే అభిప్రాయం కూడా బలంగా ఉంది.
undefined
మంత్రి కన్నబాబు ఇంతకు ముందు చాలా చురుగ్గా ఉంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో ఆయన కొంత మౌన ముద్ర దాల్చారు. ఆయన మౌనానికి గల కారణాలు తెలియడం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవడంలో ఆయన ఇంతకు ముందు చాలా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు.
undefined