ఏపీలో తాగి బండి నడిపితే చుక్కలే.. పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

First Published Aug 21, 2024, 6:39 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరాల నియంత్రణకు పటిష్టమైన పోలీసింగ్ చేయాలని, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపినవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు శాఖ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నేరం చేస్తే శిక్ష తప్పుదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పనిచేయాలన్నారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తయితే... అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలన్నారు. ప్రజల భద్రతకు ఒక భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనిచేయాలన్నారు. పూర్తి స్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ కనిపించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో గత పదేళ్లలో పోలీసు శాఖలో నెల‌కొన్న‌ పరిస్థితులపై అధికారులు వివరించారు.  2014- 19 పోల్చితే 2019- 24లో క్రైం రేట్ 46 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. 2014- 19తో పోల్చుకుంటే 2019- 23 మధ్య కాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్ నేరాలు 134.43 శాతం పెరిగాయని తెలిపారు. అలాగే, గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడించారు. గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్య‌మైందో ప‌వ‌ర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి  ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలకూ నిధులివ్వలేదు

ఏపీ పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు  ఉంటే  అందులో 88 పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. బాడీ వోర్న్ కెమెరాలు 1,250 ఉంటే 444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1,180 కెమెరాలకు గాను 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమేరాల్లో 2,371 కెమేరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన‌ రూ. 30 కోట్లు నిధులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకాండా పోయాయని.. వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య 5,215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వెల్లడించారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని... ప్రస్తుతం 2,812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్ అవసరమ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Latest Videos


Chandra Babu

నిధులు విడుదలకు సీఎం అంగీకారం

పోలీసు శాఖపై సమీక్షలో అధికారులు వివరాలు వెల్లడించిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలీసు శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవ‌స‌ర‌మైన‌ అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్థల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రూ.10 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటులో పెండింగులో ఉన్న రూ.11 కోట్ల  బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖను ఆధునికీక‌రించే  కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.61 కోట్లు విడుద‌ల చేయ‌డానికి  కూడా సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం పోలీసులను క్షక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుంది కానీ..... పోలీసు శాఖ సామర్థ్యం మాత్రం పెంచలేదన్నారు. నేర పరిశోధనలో కీలకమైన ఫింగర్ ప్రింట్ లాంటి విభాగాలకు, పరికరాలకు కనీసం రూ.10 కోట్లు యాన్యువల్ మెయింటనెన్స్ చార్జెస్ చెల్లించకపోవడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు. 

Chandra Babu

ఆడబిడ్డల జొలికి వస్తే అదే చివరిరోజు..

పోలీసు శాఖను మళ్లీ గాడిన పెడతామని, రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింద పనిచేసే ఎస్ఐ వరకు మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలన్నారు. ఆడబిడ్డల జొలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, వాడకం విపరీతంగా పెరిగిందని.. డ్రోన్స్‌ని వినియోగించి గంజాయి పంట ఎక్కడ ఉందో గుర్తించి నాశనం చేయాలన్నారు. రాష్ట్రంలో, గంజాయి డ్రగ్స్ అనే మాట వినిపించకూడదన్నారు. గంజాయి లేని రాష్ట్రం కోసం ఉత్పత్తి, సరఫరా, వాడకం మధ్య ఉన్న చైన్ తెంచడం ద్వారా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేద్దామని... ఈ కార్య‌క్ర‌మంలో తాను కూడా పాల్గొంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. 

Chandra Babu

అలసత్వం సహించేది లేదు..

నేరాల విచారణ విషయంలో అసలత్వాన్ని, ఆలస్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇకపై ఈ పరిస్థితి మారాలన్నారు. నేరం జరిగిన చోట వేగంగా పోలీసులు స్పందిచకపోతే... తానే స్వయంగా కొన్ని ఘటనలకు వెళ్లి విచారణను పర్యవేక్షిస్తానని చెప్పారు. సైబర్ క్రైంను ఎదుర్కోవడానికి నిపుణులతో చర్చించాలని... అవ‌స‌ర‌మైతే కొత్త చట్టాలు కూడా తీసుకొద్దామ‌ని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెట్టాలన్నారు. ఇన్వెస్టిగేషన్ చార్జెస్ కింద కొంత మెత్తం విచారణ అధకారులకు ఇచ్చే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారభించారని.... ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్దరించాలని అధికారులు కోరగా దానికి సీఎం అంగీకరించారు. వీటితో పాటు గ్రేహౌండ్స్ సెంటర్, ఏపీ పోలీసు అకాడమీ, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ సెంటర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు స్థితిగతులను అధికారులు వివరించారు. కేంద్రం నుంచి వీటికి రావాల్సిన నిధులు తెచ్చుకుని వెంటనే పనులు మొదలు పెట్టాలని సీఎం అదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు అనే ప్రణాళికతో రావాలని ఆదేశించారు. వాహనాల ఫిట్ నెస్ విషయంలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో వాహనదారులను వేధించినట్లు కాకుండా.. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అయ్యేవారిని వదిలిపెట్టవద్దని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా ఉండాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విపత్తు నిర్వహణ శాఖపైనా నిర్లక్ష్యం..

విపత్తు నిర్వహణ సంస్థకు తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన‌ 25 శాతం నిధులు ఇవ్వకపోగా... కేంద్రం నుంచి వచ్చిన నిధులనూ డైవర్ట్ చేశారని అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఒక రకంగా నేరమని వ్యాఖ్యానించారు. భారీ వర్షాల సమయంలో పిడుగులు పడే సందర్భాల్లో ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. నాటి తెలుగుదేశం హయాంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారని... దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో విపత్తులు వచ్చిన సమయంలో వెంటనే సంబంధిత శాఖలు సమన్వయంతో కేంద్రానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. తద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని ప్రజలకు సాయం చేయొచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.

click me!