
Andhra Pradesh MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇరురాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి... ఇవి ఇలా ముగిసాయో లేదో ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఐదు చొప్పున మొత్తం పది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఏ పార్టీకి ఎక్కువమంది ఎమ్మెల్యేల బలం ఉందో ఆ పార్టీకే అధిక ఎమ్మెల్సీ సీట్లు లభిస్తాయి... కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు దక్కించుకోనుంది.
ఇప్పటికే అన్నిపార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాయి... నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. మార్చి 11న సోమవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో అందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేసారు. తెలంగాణలో కాంగ్రెస్ తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుండి నెల్లికంటి సత్యం, బిఆర్ఎస్ నుండి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలుచేసారు. ఇక ఏపీలో ఐదింటికి ఐదు ఎమ్మెల్సీలు కూటమికే దక్కనున్నాయి. టిడిపి నుండి కావలి గ్రీష్మ, బిటి నాయుడు, బీద రవిచంద్ర, బిజెపి నుండి సోము వీర్రాజు నామినేషన్ దాఖలుచేసారు. ఇక జనసేన అభ్యర్థి నాగబాబు ముందుగానే నామినేషన్ వేసారు.
ఈ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది. అయితే బిజెపి అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ పై మాత్రం చివరిక్షణం వరకు ఉత్కంఠ నెలకొంది. కేవలం నామినేషన్ల స్వీకరణకు మరో 10 నిమిషాలే మిగిలివుందనగా హడావిడిగా నామినేషన్ ప్రక్రియను ముగించారు. తెలుగురాష్ట్రాల్లో మొత్తం పదిమంది నామినేషన్లు దాఖలుచేయగా సోము వీర్రాజుదే చాలా కాస్ట్లీ.
సోము వీర్రాజు నామినేషన్ పై ఉత్కంఠ :
ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు టిడిపి, ఒకటి జనసేన పోటీ చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బిజెపి తెరపైకి వచ్చింది... చివర్లో సోము వీర్రాజును బిజెపి బరిలోకి దింపింది. దీంతో కూటమిలోని టిడిపికి 3, జనసేనకి 1, బిజెపికి 1 ఎమ్మెల్సీ స్థానాలు దక్కాయి.
చివరి క్షణంలో తన పేరు ఖరారు కావడంతో సోము వీర్రాజు స్వస్థలం రాజమండ్రి నుండి హుటాహుటిన అమరావతికి చేరుకున్నారు. కానీ నామినేషన్ పత్రాల్లో కీలకమైన బీఫారం గానీ, అది అందించే అధ్యక్షురాలు గానీ అందుబాటులో లేరు. దీంతో అసలు బిజెపి అభ్యర్థి నామినేషన్ సజావుగా సాగుతుందా అన్న అనుమానం ఏర్పడింది.
అయితే తెలంగాణ బిజెపి కార్యాలయంలో బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సంతకంచేసిన బిఫారం ఉంది. దాన్ని ప్రత్యేక విమానంలో గన్నవరం పంపించారు. ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాల కోసం డిల్లీలో ఉన్న ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా హుటాహుటిన ఏపీకి బయలుదేరారు. కానీ ఆమె వచ్చేందుకు ఆలస్యం అయ్యేలా ఉండటంతో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు బీఫారంపై సంతకం చేసి ఇచ్చారు.
కాశీ విశ్వనాథరాజు కూడా ఏలూరులో ఓ కార్యక్రమంలో ఉండగా ఫోన్ వచ్చింది...దీంతో అర్ధాంతరంగా ఆ కార్యక్రమాన్ని ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. హైదరాబాద్ నుండి వచ్చిన బీఫారం తీసుకుని నేరుగా అసెంబ్లీకి వెళ్ళారు. అప్పటికే అక్కడ నామినేషన్ పత్రాలతో సోము వీర్రాజు సిద్దంగా ఉన్నాడు... కాబట్టి వెంటనే ఈ బీఫారం జతచేసి సమర్పించారు.
ఇలా నామినేషన్ దాఖలకు సోమవారం 3 గంటలవరకే సమయం ఉండగా 2.46 గంటలకు సోము వీర్రాజు నామినేషన్ దాఖలయ్యింది. అంటే కేవలం 14 నిమిషాల ముందు ఆయన నామినేషన్ దాఖలుచేసారు. అయితే నామినేషన్ కోసం డిల్లీ నుండి హుటాహుటిన బయలుదేరినా సమయానికి చేరుకోలేకపోయారు పురందేశ్వరి. నామినేషన్ వేసాక సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పరందేశ్వరిని కలిసారు సోము వీర్రాజు.
టిడిపి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో నారా లోకేష్ :
మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు టిడిపికి దక్కాయి. మిగతారెండు మిత్రపక్షాలు జనసేన, బిజెపికి ఇచ్చారు. ఇలా టిటిడి పోటీలో నిలిపిన కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర,బీటి నాయుడు సోమవారం నామినేషన్లు దాఖలుచేయగా ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
టిడిపి అభ్యర్థులతో పాటు మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్, టిడి జనార్థన్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, రఘురామ కృష్ణంరాజు, పితాని సత్యనారాయణ,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,పల్లా శ్రీనివాస్, కురుగొండ్ల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ కార్యక్రమంలో కూడా మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.