స్ట్రీట్ ఫుడ్.. ఇసుకలో వంట.. అదిరిపోయే టేస్ట్..ఎగబడుతున్న జనం..!

By telugu news teamFirst Published Mar 26, 2021, 9:08 AM IST
Highlights

ఢిల్లీలో ఛాట్.. ముంబయిలో వడాపావ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఎగిరే దోశ కూడా చాలా ఫేమస్ అయ్యింది. అయితే.. ఇది మాత్రం అన్నింటికన్నా భిన్నమనే చెప్పాలి. 

భారత దేశం సంస్కృతీ, సంప్రదాయాలతోపాటు.. ఫుడ్ కి కూడా బాగా ఫేమస్. దేశంలో ఏ మూలకు వెళ్లినా.. అక్కడ మాత్రమే లభించే ఓ స్పెషల్ ఫుడ్ ఉంటుంది. రకరకాల రుచులు లభించే అందమైన ప్రాంతం. ఆహార ప్రియులను తృప్తి పరచగలిగే సత్తా ఇక్కడ ఉంది.

అంతేకాదు.. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అని చెప్పాలి. ఖరీదైన రెస్టారెంట్ లలో కన్నా.. ఎక్కువగా స్ట్రీట్  ఫుడ్ ని చాలా ఇష్టంగా తినేవారు మనలో చాలా మంది ఉన్నారు. ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీలో చేస్తారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్ లోని బాగా ఫేమస్ అయిన ఓ స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు నెట్టింట కనువిందు చేస్తోంది.

ఢిల్లీలో ఛాట్.. ముంబయిలో వడాపావ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఎగిరే దోశ కూడా చాలా ఫేమస్ అయ్యింది. అయితే.. ఇది మాత్రం అన్నింటికన్నా భిన్నమనే చెప్పాలి. ఎవరు ఏ వంట చేసినా.. కూరగాయాలను నీటిలో ఉడికిస్తారు.. లేదంటే.. నూనెలో వేయిస్తారు. అలా కాదంటే.. పచ్చికూరగాయలతోనే మ్యాజిక్ చేస్తారు. అయితే.. ఈ యూపీకి చెందిన వ్యక్తి మాత్రం ఇసుకతో వంట చేస్తాడు.

నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. అతను బంగాళ దుంపలను ఇసుకలో వేసి ఉడికిస్తాడు. చుక్క నీరు, నూనే ఏమీ వాడడు. కింద కొలిమిలో నుంచి మంట భగభగమంటుంటే.. కలాయిలో ఇసుక పోసి.. దానిలో ఈ ఆలుగడ్డలు వేసి ఉడికిస్తాడు.

ఆ తర్వాత వాటిని ఓ బుట్టలో వేసి ఊపితాడు.. అలా ఊపగానే.. వాటి పొట్టు మొత్తం ఊడిపోతుంది. అంతే.. డిష్ రెడీ. ఇలా చేసిన ఆలు.. చాలా టేస్టీగా ఉంటుందట. వాటిని ప్లేట్ లో పెట్టి సర్వ్ చేస్తాడు.

దానిని తినడానికి స్పెషల్ ఛట్నీ, కొద్దిగా కారం పొడి.. అంతేకాకుండా.. స్వచ్ఛమైన బటర్ ఇస్తాడు. ఈ మూడు కాంబినేషన్ లో ఈ స్పెషల్ గా వండిన ఆలు తింటే.. ఆత్మారాముడు ఆనందంతో గంతులు వేయడం ఖాయమట. ఇక్కడ ఒక్కసారి రుచి చూసినవాళ్లు.. మళ్లీ మళ్లీ వచ్చి మరీ తింటారట. అసలు ఇతను వంట చేసే విధానమే ఇంత వెరైటీగా ఉండటం ఇక్కడ విశేషం.

ఈ వంటకం పేరు భూనా ఆలు. దీనిని దాదాపు 7 సంవత్సరాలుగా అతను అందిస్తున్నాడు. కేవలం 20 నిమిషాల సమయంలో ఆయన ఈ వంటకాన్ని రెడీ చేస్తాడు. కాగా.. ప్లేట్ భూనా ఆలు కేవలం రూ.25 కావడం గమనార్హం. అంత తక్కువ ధరకే ఎక్కువ రుచి కరమైన వంటకం అందిస్తుండటంతో స్థానికులు ఎగబడుతున్నారు.

ఈ వంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు  ఈ వీడియో చూసి షాకౌతున్నారు. కొందరైతే మాకు కూడా రుచి చూడాలని ఉందంటూ లొట్టలు వేయడం విశేషం. ఇప్పుడు ఆ వీడియో కి లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఓ ఫుడ్ బ్లాగర్ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

 

click me!