
ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి రశ్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మపేటకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లైన తర్వాత తొలిసారి అక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు విజయ్ దేవరకొండ.
విజయ్ కుటుంబానికి తుమ్మన్ పేట గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉన్న తమ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు విజయ్. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలమూ ఉన్నాయి. ఇక నుంచి తరుచుగా మన గ్రామానికి వస్తాను. అచ్చం పేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున స్కాలర్ షిప్స్ అందిస్తాం. అన్నారు.