ఉగ్రవాదానికి కేరాఫ్గా నిలిచిన పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ పాక్ దాడులకు దిగుతున్న నేపథ్యంలో భారత సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇండియాని దొంగ దెబ్బ కొట్టేందుకు పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ ఎదుర్కొని ధీటుగా సమాధానం చెబుతుంది. అంతేకాదు పాకిస్తాన్ని గట్టి దెబ్బకొడుతుంది. అక్కడి ప్రధాన నగరాలను టార్గెట్ చేసి భారత్ సైతం దాడులు నిర్వహిస్తుంది. దీంతో భారత్, పాక్ మధ్య యుద్ధం నెలకొంది.
ఈ క్రమంలో భారత ప్రభుత్వానికి, సైన్యానికి ప్రజలు సపోర్ట్ ని ప్రకటిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వాలు, ప్రతిపక్షాలు సైతం పూర్తి మద్దతుని ప్రకటించారు. ప్రభుత్వానికి సైన్యానికి స్వేచ్చనిచ్చాయి. ఈ క్రమంలో యుద్ధం అంటే భారీగా నష్టం కూడా ఉంటుంది. సైన్యానికి అన్ని రకాలుగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మన తెలుగు స్టార్స్ సైన్యం కోసం తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు.
నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండ భారత సైన్యం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తాను రౌడీ వేర్స్ పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన లాభాల్లో కొంత వాటాని సైన్యానికి అందించబోతున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశం పాకిస్తాన్ కు సరైన గుణపాఠం నేర్పేందుకు మన భారత సైన్యం ముందడుగు వేస్తోంది. ఇలాంటి సమయంలో తన బాధ్యతగా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించారు హీరో విజయ్ దేవరకొండ.
రాబోయో కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అంటూ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా షేర్ చేశారు విజయ్ దేవరకొండ. దీంతో అభిమానులను ఆయన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా తన వంతు సహకారాన్ని ప్రకటించారు. ఆయన సమర్పణలో వచ్చిన `సింగిల్` మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిశోర్ వంటి వారు నటించిన ఈ మూవీకి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. దీంతో తాజాగా థ్యాంక్స్ మీట్ నిర్వహించి సైన్యానికి జేజేలు పలికారు. ప్రభుత్వానికి, సైన్యానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఈ క్రమంలో `సింగిల్` మూవీకి సంబంధించి వచ్చే కలెక్షన్లలో కొంత వాటాని సైన్యానికి విరాళంగా అందిస్తామని తెలిపారు అల్లు అరవింద్.