
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కించి వేణు శ్రీరామ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. వకీల్ సాబ్ విడుదలై రెండేళ్లు గడుస్తున్నా ఈ దర్శకుడి కొత్త చిత్రం ప్రారంభం కాలేదు. దీనిపై అనేక రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. వాస్తవానికి వేణు శ్రీరామ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేయాల్సింది. కానీ అది పట్టాలెక్కలేదు.
ఎట్టకేలకు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ తర్వాత తన కొత్త చిత్రం ప్రారంభించబోతున్నారు. క్రేజీ హీరో నితిన్ తో ఈ చిత్రం ఉండబోతోంది. వేణు శ్రీరామ్ సిద్ధం చేసిన యాక్షన్ కథ నితిన్ కి నచ్చడంతో ఒకే చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఎవరో కాదు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కబోతోంది.
ఆగష్టు నెలాఖరులో ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. వేణు శ్రీరామ్ గతంలో అల్లు అర్జున్ తో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. ఆ కథకే మార్పులు చేసి నితిన్ తో తెరకెక్కించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపికపై ప్రస్తుతం వేణు శ్రీరామ్ కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నితిన్ నటించిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ డిసెంబర్ లో క్రిస్టమస్ కనుకగా రిలీజ్ కానుంది. మరోవైపు నితిన్.. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా నటిస్తున్నారు. మొత్తంగా నితిన్ స్పీడు మామూలుగా లేదు అని నెటిజన్లు అంటున్నారు.