
దళపతి విజయ్ నటించిన `వారసుడు` సినిమా తెలుగులో రిలీజ్ వివాదం ముదురుతుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్ను నేపథ్యంలో తెలుగులో రాష్ట్రాల్లో ఈ సినిమాకి థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. దిల్రాజు ఈ సినిమాని నిర్మించినప్పటికీ ఇది తమిళ మూవీ. తెలుగుకిది డబ్బింగ్ చిత్రం కానుంది. సంక్రాంతికి తెలుగులో అసలే భారీ చిత్రాలున్నాయి. చిరంజీవి `వాల్తేర్ వీరయ్య`, బాలకృష్ణ `వీరసింహారెడ్డి`, అఖిల్ `ఏజెంట్` చిత్రాలు సంక్రాంతి రిలీజ్ని కన్ఫమ్ చేసుకున్నాయి. వీటితోపాటు ఒకటి రెండు ఓ మోస్తారు బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి.
కానీ సంక్రాంతి బరిలోనే విజయ్ `వారసుడు` ఉంది. మొదట తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇవ్వాలని కోరుతూ ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖని విడుదల చేసింది. గతంలో తీర్మానించుకున్నట్టుగానే ఈ సంక్రాంతికి తెలుగులో నిర్మించిన సినిమాలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని, ఆ తర్వాత డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు కేటాయించాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీనిపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తుంది.
కోలీవుడ్ డైరెక్టర్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగు సినిమాలను తమిళంలో అడ్డుకుంటామని చెబుతున్నారు. తాము కూడా తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని దర్శకుడు సిమాన్ కామెంట్లు చేయడం పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. `తోడెలు` ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. హిందీ చిత్రమైనా `బేడియా`నిని అల్లు అరవింద్ తెలుగులో `తోడేలు` పేరుతో విడుదల చేస్తున్నారు. నవంబర్ 25న ఇది విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ `వారసుడు` వివాదంపై స్పందించారు.
సినిమాలకు ఇప్పుడు ఎల్లలు లేవని, బాగున్న సినిమా ఎక్కడైనా ఆడుతుందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అందరిది అని, అన్ని సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు సినిమాకి సౌత్, నార్త్ అనే తేడా లేదని స్పష్టం చేశారు. ఇక్కడ బాగున్న సినిమా అక్కడ ఆడుతుంది, అక్కడ బాగున్న సినిమా ఇక్కడ ఆడుతుందన్నారు. సినిమాలను అడ్డుకోవడం ఎవరికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే తమ లేఖపై తమిళ చిత్ర పరిశ్రమ అభ్యంతరం తెలియజేస్తున్న నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి మరోసారి స్పందించింది. తాము తమిళ సినిమాలను అడ్డుకోవాలని చెప్పలేదని, ఇక్కడ విడుదల చేయోద్దని ఎక్కడా చెప్పలేదని, కేవలం తెలుగు సినిమాలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని మాత్రమే చెప్పామని వివరణ ఇచ్చింది. ఏదేమైనా `వారసుడు` మూవీ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చుకి కారణమవుతుందని క్రిటిక్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
విజయ్ హీరోగా నటించిన `వారసుడు` చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, దిల్రాజు నిర్మిస్తుండటం విశేషం. ఒక్క హీరో తప్ప మిగిలిన సెటప్ మొత్తం తెలుగుదే కావడం మరో విశేషం. అయితే ఇటీవల సినిమా షూటింగ్ ల సమయంలో దిల్రాజు `వారసుడు`ని తమిళ మూవీగా చెప్పడం, షూటింగ్ ఆపకుండా చేయడం గమనార్హం. ఆ సమయంలో దిల్ రాజు చూపించిన అత్యుత్సాహం ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే `తోడేలు` చిత్రంలో వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. సూపర్నేచురల్ పవర్ నేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కింది. అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.