
నయనతార ఆరంభంలో అయ్యా, చంద్రముఖి చిత్రాల్లో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్నా, ఆ తరువాత గజిని, వల్లవన్ చిత్రాల్లో అంగాంగ ప్రదర్శనలతో గ్లామర్ డాల్గా మారిపోయారు. అలా కమర్షియల్ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్న నయనతారను మాయ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా మార్చేసింది. అది మొదలు లేడీ సూపర్స్టార్ అనిపించుకుంటూ వెలిగిపోతోంది.
ప్రస్తుతం దొర, ఇమైక్కా నోడిగళ్, ఆరమ్, కొలైదీర్ కాలం చిత్రాలన్నీ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలే నయనను వరించడం విశేషం. స్టార్ హీరోల నుంచి యువ నటుల సరసనా నటిస్తూ ఆల్రౌండర్ హీరోయిన్గా రాణిస్తున్నారు. కోలీవుడ్లో తన రెండో చిత్రమే సూపర్స్టార్ రజనీకాంత్కు జంటగా నటించిన నయనతార, ఆ తరువాత శివాజీ చిత్రంలో బల్లేలక్క పాటలో మెరిశారు. తాను టాప్ హీరోయిున్గా వెలుగొందుతుండగానే మరోసారి సూపర్స్టార్ రజనీకాంత్తో రొమాన్స్ చేయాలని నయన్ ఆశపడుతోందట. సహజమే కదా.. అందుకే కబాలి చిత్ర ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించనున్న తాజా చిత్రంలో చాన్స్ కొట్టేయడానికి ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఇక సూపర్స్టార్ సరసన ఒక్క చిత్రంలో అయిునా నటించాలని చాలా కాలంగా తహతహలాడుతున్న చెన్నై చిన్నది త్రిష ఈ సారి ఆయనతో నటించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముద్దుగుమ్మలిద్దరూ నటుడు ధనుష్కు సన్నిహితులే.
ఇంతకు ముందు నయనతార యారడీ నీ మోహినీ చిత్రంలో ధనుష్తో రొమన్స్ చేశారు. అంతే కాదు ఆయన నిర్మించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నాయకి నయనతారే. ఇక త్రిష ఇటీవలే ధనుష్తో కలిసి కొడి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరిని రజనీకాంత్కు జంటగా ఎంచుకోవాలన్న విషయంలో ధనుష్ జుట్టు పీక్కుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే నయనతార, త్రిషలిద్దరూ స్నేహితురాండ్లే. అయినా వృత్తి విషయంలో పోటీ పోటీనే అని ఈ ముద్దుగుమ్మలిద్దరి భావన. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ చాన్స్ ఎవరు కొట్టేస్తారో అన్నది ఆససక్తిగా మారింది.