
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి(76) (Producer M Ramakrishna Reddy)కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన చెన్నైలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. `అభిమానవంతులు`, `వైకుంఠపాళి`, `అల్లుడుగారు జిందాబాద్`, `మూడిళ్ల ముచ్చట`, `మాయగాడు`, `సీతాపతి`, అగ్ని కెరటాలు` వంటి చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా ఎదిగారు. తాజాగా ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
1948 మార్చి 8న నెల్లూరు జిల్లా గూడురులో జన్మించారు నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి. శ్రీమతి మస్తానమ్మ, ఎం.సుబ్బరామరెడ్డి ఆయన పేరెంట్స్. మైసూర్ యూనివర్సిటీలో బీ ఈ పూర్తి చేసిన తర్వాత కొంత కాలం ఆయన సిమెంట్ రేకుల వ్యాపారం చేశారు. ఆ తర్వాత తన బంధువైన ఎం ఎస్రెడ్డి సహకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1973లో శోభానాయుడు, ఫటాఫట్ జయలక్ష్మిలను పరిచయం చేస్తూ `అభిమానవంతులు` చిత్రాన్ని నిర్మించారు.దీనికి కేఎస్ రామిరెడ్డి దర్శకులు. ఈచిత్రం మంచి ఆదరణ పొందింది.
దీంతో ఆయన నిర్మాతగా వరుసగా సినిమాలు చేయడం ప్రారంభించారు.`అభిమానవంతులు` తర్వాత `వైకుంఠపాళి`, `గడుసుపిల్లోడు`, `సీతాపతి సంసారం`, `మావూరి దేవత`, `అల్లుడుగారు జిందాబాద్`, `అగ్ని కెరటాలు` చిత్రాలను నిర్మించారు. వాకాడ అప్పారావుతో కలిసి ఆయన `మూడిళ్ల ముచ్చట` సినిమా చేయడం విశేషం. మరోవైపు `అమ్మోరు తల్లి` సినిమాని డబ్ చేశారు. ఎం. రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులున్నారు.