
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన అర్థరాత్రి ఒంటిగంట(ఆదివారం) సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం మదనపల్లి. `ఆ నలుగురు` సినిమాతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న మదన్.. జగపతి బాబు - ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `పెళ్లయిన కొత్తలో` సినిమాతో దర్శకుడిగా మారారు.
`గుండె ఝల్లుమంది`, `ప్రవరాఖ్యుడు`, `కాఫీ విత్ మై వైఫ్`, `గరం`, `గాయత్రి` లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు మదన్. మదన్ చేసిన సినిమాలు తక్కువే అయినా అవి ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోయాయి. కమర్షియల్ గా హిట్స్ కాకపోయినా.. కాన్సెప్ట్ వైజ్ గా మంచి రెస్పాన్స్ సాధించాయి, విమర్శల ప్రశంసలందుకున్నాయి. దర్శకుడిగా,రచయితగా మంచి పేరు సంపాదించుకున్న మదన్ ఆకస్మిక మరణం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. దర్శకుడు మదన్ ఆకస్మిక మరణంపై తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు.