
చిత్ర పరిశ్రమని విషాదాలు వెంటాడుతున్నాయి. ఎంతో ప్రతిభ ఉన్న సినీ ప్రముఖుల గురించి చేదు వార్తలు వినాల్సి వస్తోంది. పునీత్ రాజ్ కుమార్ మరణ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అంతలోనే చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన శివశంకర్ మాస్టర్ చివరకు మృత్యు ఒడికి చేరారు. ఇటీవల Shiva Shankar Master కు కరోనా సోకడంతో చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజులుగా శివశంకర్ మాస్టర్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. వైద్యులు శ్రమించినప్పటికీ శివశంకర్ మాస్టర్ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు.
శివ శంకర్ మాస్టర్ మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. శివశంకర్ మాస్టర్ ఎంతో ప్రతిభ ఉన్న కొరియోగ్రాఫర్ అంటూ ప్రముఖులు కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్, రాజమౌళి, బాలకృష్ణ, నారా లోకేష్ లాంటి ప్రముఖులు శివశంకర్ మాస్టర్ మృతికి సంతాపం తెలిపారు.
శాస్త్రీయ నృత్యంలో పట్టున కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. కరోనా బారిన పడ్డ ఆయన కోలుకుంటారని భావించా. కానీ ఆయన మరణించడం బాధించింది. మగధీర చిత్రానికి శివశంకర్ మాస్టర్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని Pawan Kalyan సంతాపం తెలిపారు.
శివశంకర్ మాస్టర్ తో నాకు మంచి అనుబంధం ఉంది. మేమిద్దరం కొన్ని చిత్రాలకు పనిచేశాం. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలి అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.
దర్శక ధీరుడు రాజమౌళి శివ శంకర్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శివశంకర్ మాస్టర్ తో పనిచేయడం గొప్ప అనుభూతి. శివశంకర్ గారు మరణించారని విషయం బాధించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా అని రాజమౌళి తెలిపారు. మగధీర చిత్రంలో శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన 'ధీర ధీర' సాంగ్ కి జాతీయ అవార్డు లభించింది.
ప్రఖ్యాత నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతి విచారకరం. దక్షిణాది చిత్రసీమలో ఎన్నో చిత్రాలకు నృత్యరీతుల్ని సమకూర్చి లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకుని, డ్యాన్స్కి బ్రాండ్ అంబాసిడర్లాంటి మాస్టర్ మరణం చిత్రపరిశ్రమకి తీరనిలోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.