కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం.. ఫామ్‌హౌస్‌లో అధికారిక లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియలు..

By Sumanth KanukulaFirst Published Sep 12, 2022, 1:20 PM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం అయింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వరకు అంతిమయాత్ర సాగనుంది.

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం అయింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బీఎస్‌ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వరకు అంతిమయాత్ర సాగనుంది. కనకమామిడిలో ఉన్న కృష్ణంరాజు ఫామ్ హౌస్‌లో ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రముఖ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. ఇందుకోసం ప్రభుత్వం కనకమామిడిలోని ఫామ్‌హౌస్‌లో ఏర్పాట్లు చేసింది. 

పోస్టు కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణం ఆయన కుటుంబంతో పాటు, టాలీవుడ్‌లో, ఆయన అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణంరాజు భౌతికకాయానికి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

అయితే తొలుత జూబ్లీహిల్స్ మహాప్రస్తానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ తర్వాత మొయినాబాద్‌ సమీపంలోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లోనే కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫామ్‌హౌస్‌ను కృష్ణంరాజ్‌ ఐదేళ్ల క్రితం కొనుగోలు చేశారు. అక్కడ ఓ ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. అయితే అది పూర్తికాకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. అయితే అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

ఇక, 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో  వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండో తరం స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. కృష్ణంరాజు మరణవార్త విన్న టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

Also Read: కృష్ణంరాజు‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించాం.. ఆయన మృతికి కారణమిదే: ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..

బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, తల్లీ కొడుకులు, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తాండ్ర పాపారాయుడు, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, బావా బావమరిది లాంటి సినిమాలు  ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భక్త కన్నప్ప టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. శివ భక్తుడిగా కృష్ణం రాజు నటన అబ్బురపరిచింది. కృష్ణంరాజు 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. 

మరోవైపు కృష్ణం రాజు  రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీతో యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 1998‌లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత 1999లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన మరోసారి బీజేపీలో చేరారు. ఇక, కృష్ణంరాజు మరణవార్త టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, సినీ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

click me!