
నవంబర్ మాసం సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోల సినిమాల విడుదలకు సీజన్ గా మారింది. ఇప్పటికే కొన్నేళ్లుగా హిట్ కోసం తపన పడుతున్న రాజశేఖర్.. గరుడవేగ సినిమాతో హిట్ కొట్టగా.. ఈ వారం మంచు మనోజ్, సందీప్ కిషన్, విశాల్ ముగ్గురూ రోజున తమ తమ సినిమాలతో వచ్చారు. ‘ఒక్కడు మిగిలాడు’ అంటూ మంచు మనోజ్, ‘కేరాఫ్ సూర్య’తో సందీప్ కిషన్, ‘డిటెక్టివ్’తో విశాల్ నేడు ప్రేక్షకులను పలకరిస్తున్నారు.
మంచు మనోజ్ హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తున్నా మనోజ్ కు సక్సెస్ అని చెప్పుకునే సినిమాలు కరువయ్యాయి. ఈసారి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎల్టీటీఈ ప్రభాకరన్ తరహా పాత్రలో మనోజ్ వచ్చాడు. మరి ఈ రియాలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.
తమిళంలో సక్సెస్ అయిన మన తెలుగబ్బాయి విశాల్ డబ్బింగ్ సినిమాలు కూడా మన దగ్గర అంతగా ఆడటం లేదు ఈ మధ్య. ఈ నేపథ్యంలో తమిళంలో హిట్టైన సినిమాను ‘డిటెక్టివ్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. తమిళులు మెచ్చిన ఈ సినిమా తెలుగు వారిని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
సందీప్ కిషన్ పరిస్థితి కూడా ఇటీవల కాలంలో అంత ఆశాజనకంగా లేదు. కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాతో సందీప్ కిషన్ కు ఒక డిజాస్టర్ మిగిలింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సందీప్ తాజాగా... తమిళ దర్శకుడు సుసీంద్రన్ తో ‘కేరాఫ్ సూర్య’ సినిమాతో వస్తున్నాడు. వరస పరాజయాల మధ్యన ఉన్న సందీప్ కు ఈ సినిమా అయినా ఊరటనిస్తుందేమో చూడాలి.
హిట్ కోసం ఈ ముగ్గురు హీరోల్లో ఎవరెవరి లక్ ఎంతుందో సినిమాల రిజల్ట్ ను బట్టి తేలనుంది.