
ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ (Lata Mangeshkar) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఎనిమిది దశాబ్దాల పాటు తన పాట తో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేశారని.. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారత దేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం అన్నారు. లతా జీ మరణం తో పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.
‘20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. వెండితెర మీది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్ల ను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు, కానీ, సింగర్ గా లతా జీ సమయం ఇచ్చినంకనే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ .. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వం లో వోలలాడించిన లతా మంగేశ్వర్, ఉత్తర దక్షినాది కి సంగీత సరిగమల వారధి.
హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన , తన గాత్రం లో ఉర్దూ భాష లోని గజల్ గమకాల సొబగులను లాతాజీ గాత్రం వొలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతా జీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది’ అని సీఎం స్మరించుకున్నారు.
ఇక, 2022 జనవరి 11న లతా మంగేష్కర్ కరోనా (Corona virus)బారినపడ్డారు. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లతాజీ వయసు రీత్యా వైద్యం అందించడానికి ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగారు. దాదాపు నెల రోజులుగా లతాజీ ఐసీయూలో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ట్ తీసుకుంటున్నారు.
లతాజీ ఆర్యోగం మెరుగుపడుతుందని, వెంటిలేటర్ సపోర్ట్ తీసేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అనూహ్యంగా లతాజీ ఆరోగ్యం మరలా క్షీణించడం మొదలుపెట్టింది. వైద్యులు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ (Latha Mangeshkar no more)తనువు చాలించారు.