
నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్కు తేజ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తర్వాత రకరకాల కారణాలతో ఆయన ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఈ బయోపిక్ను తీయగలననే పూర్తి నమ్మకం లేక తప్పుకున్నట్లు అప్పుడు మీడియాతో చెప్పారు.ఆ తర్వాత సీన్ లోకి దర్శకుడు క్రిష్ వచ్చారు. ఆయన అతి వేగంగా ఈ సినిమాను పూర్తి చేసారు.
ఈ బయోపిక్ తొలి భాగం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై తేజ స్పందనను మీడియావాళ్లు అడిగారు.
తేజ మాట్లాడుతూ.... ‘నా తర్వాతి సినిమాతో చాలా బిజీగా ఉన్నాను. నాకు ఎన్టీఆర్ బయోపిక్ చూసే సమయం లేదు. అందుకే నేను స్పందించలేకపోతున్నా. సినిమా చూసుంటే కచ్చితంగా మాట్లాడేవాడ్ని’ అని తేజ అన్నారు. అనంతరం సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా? అని ప్రశ్నించగా.. ‘అది దర్శకుడిపై ఆధారపడుతుంది. ఆయనే తన పనితనాన్ని చూపించాలి’ అని చెప్పారు.
ఎన్టీఆర్ బయోపిక్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ నిర్మించిన ఈ బయోపిక్ను వారాహి చలన చిత్రం సంస్థ సమర్పించింది. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఈ బయోపిక్ను రెండు భాగాలు చేసారు. ఇప్పటికే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ జనవరి 9న విడుదలైంది. రెండో భాగం ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ బయోపిక్లో బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హరికృష్ణగా కల్యాణ్రామ్, శ్రీదేవిగా రకుల్ప్రీత్ సింగ్, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్రాజ్, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మేనన్ నటించారు.