
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రయోగాల బాట పడుతూ పెద్ద సాహసాలే చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.
ప్రస్తుతం తేజ సజ్జా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను మాన్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. హను మాన్ చిత్రం ఆంజనేయ స్వామి నేపథ్యంలో విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ హను మాన్ తో పెద్ద అద్భుతమే సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ హీరోగా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది.
ఆ మధ్యన విడుదలైన టీజర్, పాటలు హను మాన్ చిత్రంపై ఆసక్తిని పెంచేశాయి. మీడియం రేంజ్ బడ్జెట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంత క్వాలిటీ అవుట్ పుట్ ఎలా తీసుకురాగలుగుతున్నారు అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా హను మాన్ చిత్ర యూనిట్ మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. బడా హీరోలు పోటీకి దిగే సంక్రాంతి సీజన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.
జనవరి 12, 2024 సంక్రాంతికి హను మాన్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనితో ప్రభాస్, మహేష్ బాబుతో హను మాన్ పోటీ ఖరారైంది. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం జనవరి 13న రిలీజ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంది. ఇక 12న ప్రభాస్ ప్రాజెక్టు కె రిలీజ్ కావలసి ఉంది. ఇద్దరు బడా హీరోలతో తేజ సజ్జ పోటీకి దిగుతుండడం అందరిని ఆశ్చర్యపరిచే అంశమే. చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ప్రభాస్ ప్రాజెక్టు కె షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ వరల్డ్ క్లాస్ మూవీ కాబట్టి రానున్న రోజుల్లో రిలీజ్ విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో చూడాలి. ఇప్పటికైతే హను మాన్, ప్రాజెక్ట్ కె , గుంటూరు కారం చిత్రాలు సంక్రాంతి బెర్త్ ఖరారు చేసుకున్నాయి.
హనుమాన్ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావలసింది. కానీ సిజి వర్క్ కారణంగా డిలే అయింది. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రాన్ని సంగీత దర్శకులు.