
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్రం వరుస వివాదాలు. నెగిటివ్ మౌత్ టాక్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఫలితంగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు ఆదిపురుష్ పోరాటం ముగిసినట్లే. కానీ ఇంకా ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం వదలడం లేదు.
ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఇటీవల కులదీప్ తివారి, నవీన్ ధావన్ అలహాబాద్ హై కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అలహాబాద్ హై కోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేస్తూ.. చిత్ర దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, రచయిత మనోజ్ ముంతాషీర్ జూలై 27 లోపు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
దీనిని ఛాలెంజ్ చేస్తూ ఆదిపురుష్ మేకర్స్ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో తాము వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. నేడు ఆదిపురుష్ మేకర్స్ తరుపున లాయర్ అర్జెంట్ హియరింగ్ కోరగా సుప్రీం కోర్టు చిన్న షాక్ ఇచ్చింది. ఈ కేసుకు తొందర లేదని.. రేపు అంటే జూన్ 13న మ్యాటర్ ముందు పెట్టాలని కోరింది.
ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధ కాండ ఆధారంగా ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా రామాయణాన్ని మోడ్రనైజ్ చేయాలనుకోవడం ఓం రౌత్ చేసిన కాస్ట్లీ మిస్టేక్ గా మారిపోయింది. ఆ పాత్రల వేషధారణ, డైలాగులు, హాలీవుడ్ హార్రర్ చిత్రాలని తలపించే గ్రాఫిక్స్ వివాదాలకు కారణం అయ్యాయి.
ఆదిపురుష్ చిత్రం రామాయణాన్ని కించపరిచే విధంగా అందులో డైలాగ్స్, చిత్రీకరణ ఉందంటూ తీవ్ర వివాదం అయింది. దీనిపై అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేయగా జూన్ 30న విచారణ జరిగింది. జూలై 27 లోగా దర్శకుడు,నిర్మాత, రచయిత కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
అలాగే కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖని ఆదేశిస్తూ.. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసి ఆదిపురుష్ చిత్రంపై రిపోర్ట్ రెడీ చేయాలని కోరింది. అలాగే సెన్సార్ బోర్టు కూడానా అఫిడవిట్ తో రావాలని ఆదేశించింది. చూస్తుంటే అలహాబాద్ హై కోర్టు ఆదిపురుష్ చిత్రంపై లోతుగానే విచారణ జరిపేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిని ఛాలెంజ్ చేస్తూ ఆదిపురుష్ మేకర్స్ సుప్రీం కోర్టుని ఆశ్రయించగా బుధవారం రోజు షాక్ తగిలింది. గురువారం సుప్రీం కోర్టు మేకర్స్ అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.