​ రజినీకాంత్ హెల్త్ అప్డేట్: స్టెంట్ వేసిన వైద్యులు, కండీషన్ ఏమిటంటే?

By Sambi ReddyFirst Published Oct 1, 2024, 4:11 PM IST
Highlights

చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజినీకాంత్  హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు . ఆయనకు స్టెంట్ అమర్చారట. 
 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతుంది. సోమవారం రాత్రి ఆయనకు తీవ్ర కడుపు నొప్పి వచ్చిందట. వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రజినీకాంత్ అనారోగ్యానికి గురైన నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రజినీకాంత్ 30వ తేదీన గ్రేమ్స్ రోడ్ లో గల అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండె నుండి శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్త నాళంలో(aorta)వాపు చోటు చేసుకుంది. శస్త్ర చికిత్స అవసరం లేకుండా ట్రాన్స్ క్యాథటర్ పద్దతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ ఆర్టా కి స్టెంట్ అమర్చారు. రజినీకాంత్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు.. అని బులెటిన్ లో రాసుకొచ్చారు. 

Latest Videos

73ఏళ్ల రజినీకాంత్ తరచుగా అనారోగ్యం బారినపడుతున్నాడు. ఆరోగ్యం సహకరించని కారణంగానే రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. త్వరలో పార్టీ ప్రకటన చేస్తారనగా.. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు ఇంటి ముందు ధర్నాలు చేసినా... ఆయన డెసిషన్ మారలేదు. ఆ మధ్య రజినీకాంత్ అమెరికాలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్నారు. అయితే రజినీకాంత్ వరుస చిత్రాలు చేస్తున్నారు. రజినీకాంత్ గత చిత్రం జైలర్ బ్లాక్ బస్టర్ హిట్. వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

ప్రస్తుతం ఆయన వేట్టయాన్‌, కూలీ చిత్రాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న విడుదల కానుంది. దసరా కానుకగా బాక్సాఫీసు ముందుకొస్తున్న చిత్రాల్లో ‘వేట్టయాన్‌’ ఒకటి. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు  పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ మూవీ రన్‌టైమ్‌ 163.25 నిమిషాలు (2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు) . మూడు డైలాగులుపై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని మ్యూట్‌ చేయడమో.. వేరే పదాలు వినియోగించడమో చేయాలని చిత్ర టీమ్ కి సూచించింది.

తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంతో దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది రజనీకాంత్‌కు 170వ చిత్రం. ఆయన ఇందులో రిటైర్డ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్టు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, మంజు వారియర్‌,  కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానుంది. 

ఇక కూలీ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూలీ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక రోల్ చేయడం విశేషం. ఇటీవల కూలీ షూటింగ్స్ సెట్స్ నుండి వీడియోలు లీక్ అయ్యాయి. సదరు లీక్డ్ వీడియోల్లో నాగార్జున లుక్ మైండ్ బ్లాక్ చేసింది. కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

click me!