బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్కి గుర్రపు స్వారీ, కత్తియుద్ధం, కర్రసాము వచ్చు. హిందీలో నటించిన చారిత్రక చిత్రం ‘ఏక్ పహేలీ లీలా’ కోసం ఆమె నేర్చుకున్నారు. ఇప్పుడామె తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చారిత్రక చిత్రం ‘వీరమహా దేవి’ కోసం గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
మళ్ళీ ఎందుకు? అని సన్నీ లియోన్ని అడిగితే... ‘‘నాకు గుర్రపుస్వారీ వచ్చు. అయితే... అది విదేశీయులు గుర్రాన్ని స్వారీ చేసే తరహాలో ఉంటుంది. దేశీ స్టైల్ వేరుగా ఉంటుంది. అందులోనూ... ‘వీరమహా దేవి’లో నేను గుర్రపు స్వారీ చేస్తుంటే, నా వెనుక మరో యాభై మంది గుర్రాలతో వస్తుంటారు. అటువంటి సన్నివేశాల్లో గుర్రాన్ని స్వారీ చేయడం పెద్ద సవాల్. అందుకని, మళ్ళీ ప్రత్యేకంగా నేర్చుకున్నా’’ అన్నారు.
వీసీ వడివుడయాన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం సన్నీ లియోన్ చాలా కష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో 150 రోజులను కేవలం ఈ చిత్రం కోసమే కేటాయించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారు.