ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం, దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కూడా అయిన సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ ..దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైన అంశాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్లు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారని.. ఈ నేపథ్యంలో ఆమెతో బలంగా మద్యం సేవించారా అనేది తేలాలన్నారు. శ్రీదేవిని హత్య చేశారనే అనుమానం తనకు కలుగుతోందంటూ పెను సంచలనానికి తెర తీసారు.
ఈ మొత్తం వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గుండెపోటుతో చనిపోయారని ప్రకటించడం ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని భావిస్తున్నానన్నారు. అంతేకాదు సినీతారలకు దావూద్కు సంబంధాలున్నాయనీ.. ఈ వైపుగా దృష్టి కేంద్రీకరించాలంటూ స్వామి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే మీడియాలో వస్తున్న విషయాలు గందరగోళంగా వున్నాయన్నారు. మీడియా సంయమనం పాటించాలని ప్రాసిక్యూషన్ విషయాలను ప్రకటించే దాకా వేచి వుండాలని సుబ్రహ్యణ్యస్వామి పేర్కొన్నారు.