
రియల్ హీరో సోనూసూద్ని సినిమాలో హీరో కొట్టడాన్ని తట్టుకోలేకపోయాడు ఓ బుడ్డోడు. ఏకంగా టీవీనే బద్దలు కొట్టాడు. ఈ ఆసక్తికర సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. దీనిపై సోనూసూద్ స్పందన ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. అసలేం జరిగిందంటే? న్యాల్కల్లోని ఎస్సీ కాలనీకి చెందిన పుష్పలతకి సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సీహెచ్ ప్రణయ్ కుమార్తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి విరాట్ అనే మూడో తరగతి చదువుకుంటున్న కుమారుడున్నారు.
కరోనా కారణంగా స్కూల్స్ లేకపోవడంతో అమ్మమ్మ ఇళ్లైన న్యాల్కల్ కి వచ్చాడు. సోమవారం రాత్రి ఇంట్లో మరదలు అద్విన్తో కలిసి టీవీలో `దూకుడు` సినిమా చూస్తున్నాడు. ఇందులో హీరో మహేష్బాబు విలన్ పాత్రధారి అయిన సోనూసూద్ని ఫైట్ సీన్లో కొడుతుంటాడు. సోనూసూద్ని కొట్టడాన్ని చూసిన బుడ్డోడు విరాట్ కోపంతో రగిలిపోయాడు. కరోనా టైమ్లో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ అంకుల్ని కొడతావా అంటూ టీవీని పగులగొట్టాడు.
పక్కనే సినిమా చూస్తున్న మరదలు అద్విన్ టీవీని పగుల గొడతావా? ఇంకో టీవీ తీసుకరా అంటూ ఏడవ సాగింది. గమనించిన కుటుంబ సభ్యులు టీవీని ఎందుకు పగుల గొట్టావురా అంటూ విరాట్ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్ అంకుల్ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి పగులకొట్టా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. చివరికిది సోనూసూద్ను చేరడంతో ట్విటర్లో స్పందించాడు. `అరేయ్.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు` అంటూ ట్వీట్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో అనేందుకు ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.