
తెలుగు సినీ కార్మికులు వేతనాల పెంపు కోసం గత కొన్ని రోజులుగా నిరసన(సమ్మె) తెలుపుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ల బంద్కి పిలుపిచ్చారు. 30శాతం వేతనాలు పెంపుకు ఒప్పుకున్న నిర్మాతల షూటింగ్లకు హాజరవుతున్నారు. దీంతో సినిమాల షూటింగ్లన్నీ ఆగిపోయాయి. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్కి, ఫిల్మ్ ఫెడరేషన్కి మధ్య చర్చలు నడుస్తున్నాయి. పలు మార్లు చర్చలు జరిగినా సమస్యకి పరిష్కారం దొరకలేదు. మూడేళ్లలో 25 శాతం పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకున్నారు. కానీ నాలుగు కండీషన్స్ పెట్టారు. దీనికి సినీ కార్మిక నాయకులు ఒప్పుకోవడం లేదు. రూ.2000 లోపు రోజు వారి వేతనాలు ఉన్న వారికే మూడేళ్లలో 25 శాతం వేతనాలు పెంచుతామని, ఆ పై ఉన్నవారికి పెంచమని నిర్మాతలు చెప్పిన నేపథ్యంలో ఫెడరేషన్ ఒప్పుకోవడం లేదు. ఇది మరింత వివాదంగా మారింది.
ఈ సమస్య చిరంజీవి, బాలయ్య వద్దకు వెళ్లింది. ఫిల్మ్ ఛాంబర్తోనే మాట్లాడుకోవాలని, అయినా సమస్య పరిష్కారం దొరక్కపోతే తాము ఇన్ ఇన్వాల్వ్ అవుతామని తెలిపారు. ఈ క్రమంలో ఓ వైపు పెద్ద నిర్మాతలు అటు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ని సోమవారం మధ్యాహ్నం కలిశారు. తమ సమస్యలు విన్నవించారు. ఇంకోవైపు చిన్న నిర్మాతలు అంతా కలిసి సోమవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టారు. తమ సినిమా కష్టాలను పంచుకున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ వర్రె, తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ, చిన్న నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మా లాంటి నిర్మాతలకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఇబ్బందిపెడుతోంది. మా సినిమా దీపాళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఇప్పుడు సమ్మె వల్ల షూటింగ్ ఆపేయాల్సివచ్చింది. సినిమా షూటింగ్ కోసం లెక్క చూస్తే 150 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ సెట్ లో 50 మంది కూడా ఉండరు. వాళ్లకు ఇస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోంది. ఓటీటీ, డబ్బింగ్ సినిమాలకు డబ్బులు ఏవీ టైంకు రావట్లేదు. కానీ, మేం మాత్రం ఏ రోజుకి ఆ రోజు డబ్బులివ్వాలంటే అయ్యే పనేనా?` అని అన్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఒక చిన్న సీన్ చేయాలనుకుని జెనరేటర్ పెట్టాలన్నా యూనియన్ పర్మిషన్ కావాలి. హీరో, ఫ్రెండ్ సీన్ కోసం మేకప్, కాస్ట్యూమ్స్, వాళ్లకు వడ్డించే ప్రొడక్షన్..ఇలా 80 మందిని పెట్టుకోవాలి. చిన్న నిర్మాతకు ఇంతమందిని పెట్టుకోవడం పెనుభారంగా మారింది. వాస్తవానికి అక్కడ పనిచేసేది ఆరుగురు మాత్రమే. మిగతా వాళ్లకు పేమెంట్స్ ఇవ్వాలి. ఇంత మందిని మా నెత్తిన రుద్దడం ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది` అని వెల్లడించారు.
నిర్మాత ప్రైమ్ షో చైతన్య మాట్లాడుతూ - సినీ నిర్మాతల పరిస్థితి దయనీయంగా ఉంది. మన దగ్గరే కాదు దేశ విదేశాల్లోనూ ఫిలింమేకింగ్ ఇబ్బందుల్లో ఉంది. సినిమానే కాదు ఐటీ, రియల్ ఎస్టేట్ సహా ప్రతి ఇండస్ట్రీ స్లంప్ లో ఉంది. రేపు బాగుంటుందనే అందరూ పనిచేస్తున్నారు. మేము చెప్పిన వాళ్లనే పెట్టుకోండి, ఇంతమందిని ఖచ్చితంగా షూటింగ్ కు తీసుకోవాలి అనడం కరెక్ట్ కాదు. నిర్మాతలు ఎంప్లాయ్ మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఏ నిర్మాత కూడా సంతోషంగా లేడు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నా` అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణం భారంగా మారుతోంది. రెండు కోట్ల రూపాయల్లో చేయాల్సిన సినిమాకు నాలుగైదు రెట్ల ఖర్చు అవుతోంది. మా దగ్గరకు రిలీజ్ చేయమని వచ్చే సినిమాలు చూస్తే 2 కోట్లలో చేయాల్సినవి అనిపిస్తాయి కానీ వాళ్లు నాలుగైదు రెట్లు ఎక్కువ అయ్యింది అని చెబుతారు. థియేటర్స్ నుంచి అంత డబ్బులు రావడం లేదు. ఇంత ప్రొడక్షన్ ఖర్చు ఎందుకు అవుతోంది. సినీ కార్మిక సంఘాలు ఒకసారి నిర్మాత స్థానంలోకి వచ్చి ఆలోచిస్తే మా బాధలు తెలుస్తాయి` అని అన్నారు.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ, `ఇండస్ట్రీలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే. మీకు 30శాతం కాదు 50శాతం పెంచుతాం. కానీ థియేట్రికల్ గా రెవెన్యూ పరంగా, మేము పెట్టిన ఖర్చు పరంగా, ఏ రూపంలో అయినా మాకు పెట్టుబడి తిరిగొస్తుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా. అన్నీ పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయని పెద్ద నిర్మాతలు కొందరు అంటున్నారు. మీ పరిస్థితి వేరు, చిన్న నిర్మాతల పరిస్థితి వేరు. చిన్న సినిమాలకు 25 పర్సెంట్ వేతనాలు తగ్గించండి అని ఫెడరేషన్ తో ఒప్పందం చేసుకుంటే దాన్ని వాళ్లు పాటిస్తున్నారా లేదు. ఏ సినిమాకైనా అదే కష్టం అంటూ పెద్ద సినిమాలతో సమానంగా వేతనాలు తీసుకుంటున్నారు. ఫైనాన్స్ కట్టుకోవాలి, చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేయాలి వంటి ఎన్నో టెన్షన్స్ మాలో ఉంటాయి. రోజూ అన్ని ఖర్చులు పెట్టి, ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తుంటాం. ప్రొడ్యూసర్స్ మేము అని సంతృప్తి పడతాం.
వందల కోట్లు తీసుకునే హీరోలు ఒకరిద్దరే. మా హీరో కిరణ్ అబ్బవరం `చెన్నై లవ్ స్టోరీ`కి ఎంతో సపోర్ట్ చేశారు. పరిస్థితి అర్థం చేసుకుని ముందు మంచి సినిమా చేద్దామని ముందుకొచ్చారు. అలాంటి హీరోలు ఎంతమంది ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీకు 30శాతం కావాలని ఎలా అడగాలని అనిపిస్తోంది. టికెట్ రేట్సు పెంచుకునేది వేళ్ల మీద లెక్కపెట్టేన్ని సినిమాలకే. మేము రైజింగ్ ప్రొడ్యూసర్స్ కాదు బర్నింగ్ ప్రొడ్యూసర్స్. మాది మేకపోతు గాంభీర్యమే. చాలా మంది.. నిర్మాతలకు ఏంటి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ సినిమాతో డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఇచ్చే నిర్మాత ఎవరైనా ఉన్నారా. డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎవరి వైపు ఉన్నారో స్పష్టత ఇవ్వాలి. కావాలంటే మేము సినిమాలు తీయడం ఆపేస్తాం. షూటింగ్ కు ఇంతమందిని తీసుకోవాలి, ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు మీకెక్కడిది. అసలు బిజినెస్ లేదని మేము బాధపడుతుంటే 30 పర్సెంట్ పెంచాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్.
కొందరు నిర్మాతలు తమ కేసులు, జెండాలు, అజెండాల మేరకు కార్మికులు అందరికీ ఒకేలా వేతనాలు పెంచాలని అంటున్నారు. సినీ కార్మికుల ముసుగులో తమ స్వలాభం కోసం చూస్తున్నారు. ప్రతి క్రాఫ్ట్ వాళ్లు మీరు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోండి. మీరు డిమాండ్స్ మాత్రమే చేసి హక్కులు మర్చిపోతే ఎలా. మీరు మారకుంటే మా బడ్జెట్ లో వచ్చేవాళ్లతో సినిమాలు నిర్మించుకుంటాం. సినిమాకు మాకు కంఫర్ట్ కాదు ప్యాషన్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మాలాంటి చిన్న నిర్మాతలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ బాగుండాలి అని అనుకోవాలి గానీ మేము మాత్రమే బాగుండాలని యూనియన్స్ వాళ్లు ఆలోచించడం సరికాదు. ఏ హీరో కూడా మాకింత ఇవ్వకుంటే షూటింగ్స్ బంద్ అనడం లేదు. పరిస్థితి అర్థం చేసుకుని సినిమాలు చేస్తున్నారు. యూనియన్స్ కూడా ఇది మన ఇండస్ట్రీ మన ప్రొడ్యూసర్స్ అనే భావనతో పనిచేయాలి` అని అన్నారు.