
`కోర్ట్` మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన శివాజీ ఇప్పుడు `దండోరా` అంటూ రాబోతున్నారు. ఇందులో ఆయనతోపాటు నవదీన్, రవికృష్ణ, నందు, మనికా చిక్కాల, మౌనికా రెడ్డ, బిందు మాధవి, రాద్య, అదితి భావరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోమవారం విడుదల చేశారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కాబోతుంది. తాజగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
టీజర్ చూస్తే, రవికృష్ణ తన లవర్తో మాట్లాడుతూ ఆమెను ముద్దు పెట్టుకుంటానని అంటాడు. ‘ఏం చేద్దామనుకుంటున్నావ్.. పిచ్చిపిచ్చిగా ఉందా’ అంటూ ఆ అమ్మాయి రివర్స్ అయ్యే సీన్ కామెడీగా ఉంటుంది. అనంతరం సర్పంచ్గా నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు. కూలింగ్ గ్లాసెస్ వేసుకుని అందరూ నమస్కారం పెడుతుంటే తను కూడా వారికి విష్ చేస్తూ కనిపించాడు. మరో పెద్దమనిషి పాత్రలో నటుడు శివాజీ కనిపించారు. ‘హైదరాబాద్ పో.. అమెరికా పో.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె’ అని చెబుతుంటాడు. `మేం తంతే లేవనోళ్లు.. అయినొచ్చి గొకితే లేస్తరని ఎందివయా ఇది’ అని వెటకారంగా నవదీప్ చెప్పే డైలాగ్, పల్లెటూర్లు కొన్ని సీన్స్ కామెడీ టచ్తో సాగేలా ఉన్నాయి. నందు కారులో వెళ్తూ భార్య కూతుర్ని తిడుతుంటాడు. అలాగే బిందు మాధవి వేశ్య పాత్రలో కనిపించింది. ‘ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని, వాళ్లు డబ్బులిస్తున్నారు, నేను వాళ్లకి సర్వీస్ చేస్తున్నానంటూ`’ ఆమె శివాజీతో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
నెక్ట్స్ సీన్లో ఓ ఎమోషనల్ కోణాన్ని ఆవిష్కరించాడు. శవాన్ని మోస్తూ తీసుకెళుతుంటారు. అక్కడ ఓ పిల్లాడు అన్నా.. `మా అవ్వను ఇంత దూరం ఎందుకు తీసుకెళుతున్నార`ని ప్రశ్నిస్తాడు. ‘నాలుగు పుస్తకాలు చదివి..లోకమంతా తెలిసినట్లు మాట్లాడొద్దు.. నీకు తెలియని లోకం ఇంకోటుందిరా’, ‘చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద’ అంటూ శివాజీ చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాలో మరేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందని తెలుస్తోంది. పుట్టుకకు, చావు మధ్య మనిషి ఎదుర్కొనే సంఘర్షణ, పరిస్థితులు, భావోద్వేగాలు గురించి చెప్పే కథాంశంతో ‘దండోరా’ రూపొందుతోందని స్పష్టమవుతోంది.
దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని `దండోరా` సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కులం అనే సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేస్తున్నారట. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. టీజర్తో దర్శకుడు బలమైన అంశాన్ని చెప్పాలనకుంటున్నాడనే విషయం తెలుస్తుంది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
శివాజీ మాట్లాడుతూ, మురళీ గారు చెప్పిన కథ విని ఎంతో కనెక్ట్ అయ్యాను. మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్గా అద్భుతమైన కథను రాసుకున్నారు. ప్రతీ ఒక్కరి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. బిందు మాధవి గారు అద్భుతంగా నటించారు. తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. అంతకంటే గొప్ప ఆర్టిస్టులున్నారని అర్థం అవుతుంది. నవదీప్కి ఎంతో సత్తా ఉంది. అతన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎవ్వరూ వాడుకోవడం లేదు. అతన్ని కళ్లని దర్శకులు వాడుకోవడం లేదు. నవదీప్ చాలా గొప్ప ఆర్టిస్ట్. నందు కూడా బాగా నటించారు. ఈ ఏడాదిలో గుర్తుంచుకోదగ్గ చిత్రంగా ‘దండోరా’ నిలుస్తుంది. వెంకట్ ఫోటోగ్రఫీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. బీజీఎం అదిరిపోయింది. అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశాం. నాకు ఇది మంచి బిర్యానీలాంటి చిత్రం. నటించడానికి చాలా స్కోప్ దొరికింది. నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలిపారు` శివాజీ.
నవదీప్ మాట్లాడుతూ, `మెదక్ నుంచి అమెరికాకు వెళ్లి జాబ్ చేస్తూ.. అది వదిలి.. సినిమాల్లోకి వచ్చి మురళీ కాంత్ ఈ ‘దండోరా’ని చేశారు. చావు, కులం అనే పాయింట్లతో ఎంటర్టైనింగ్గా ఎన్నో మంచి విషయాల్ని చెప్పారు. ఏదో నీతిని బోధిస్తున్నట్టుగా అని కాకుండా అందరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. ఇలాంటి కథకు సపోర్ట్గా నిలిచిన బెన్నీ గారికి హ్యాట్సాఫ్. ఆడియెన్స్గా ఈ సినిమాను మేం చూసినప్పుడు మాకు చాలా నచ్చింది. నటీనటులుగా మేమంతా సంతృప్తి చెందాం. శివాజీ గారి లాంటి సీనియర్ ఆర్టిస్టుల నుంచి కొత్త ఆర్టిస్టుల వరకు అందరూ అద్భుతంగా నటించారు. వారందరితోనూ మురళీ అద్భుతంగా చేయించుకున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. ఓ మీనింగ్ ఫుల్ సినిమాను తీశామని మాత్రం చెప్పగలను. అందరూ చూసి మీ మీ అభిప్రాయాల్ని చెప్పండి’ అని అన్నారు.
బిందు మాధవి మాట్లాడుతూ .. ‘‘దండోరా’లో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. అన్ని కారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమాజంలో ఆలోచనలు రేకెత్తించేలా మా ‘దండోరా’ ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తూ మంచి విషయాల్ని చెప్పే ప్రయత్నం చెప్పాం. మనం మాట్లాడుకోలేని ఎన్నో టాపిక్స్ని ‘దండోరా’ టచ్ చేస్తుంది. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఎంతో సున్నితమైన సబ్జెక్ట్ను మా దర్శకుడు ఇంకెంతో ఎంటర్టైనింగ్గా చెప్పారు. శివాజీ, నవదీప్ గార్లతో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.