
సిల్వర్ స్క్రీన్ పై రచ్చ మొదలవబోతుంది. మాస్కి పూనకాలు తెప్పించే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి జోడీగా మాస్ డాన్సులకు కేరాఫ్గా నిలిచే శృతి హాసన్(Shruti Haasan) డాన్సులు వేస్తే ఇక మాస్ ఆడియెన్స్ కి పూనకాలు డబుల్ అవుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అవును ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. మెగాస్టార్ నటిస్తున్న `మెగా154`(Mega154) చిత్రంలో హీరోయిన్గా శృతి హాసన్ ఎంపికైంది. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా Chiranjeevi ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ లోకి శృతి హాసన్ని ఆహ్వానిస్తూ స్వయంగా తన నివాసంలో శృతికి ఫ్లవర్ బోకే అందించి స్వాగతం పలికారు చిరంజీవి.
`మహిళా దినోత్సవం సందర్భంగా మీకు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది Shruti Haasan. మీరు `మెగా154`లోకి రావడం వల్ల సినిమాకి స్త్రీ శక్తి తోడు కాబోతుంది` అని వెల్లడించారు చిరంజీవి. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెబుతూ ఆమెతో దిగిన ఫోటోని పంచుకున్నారు మెగాస్టార్. మరోవైపు దర్శకుడు బాబీ సైతం శృతి హాసన్కి స్వాగతం పలికారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఈ `మెగా154`(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. సముద్రంలోకి బోట్లో చేపల వేటకి వెళ్తున్న చిరంజీవి బ్యాక్ సైడ్ లుక్ అదిరిపోయింది. అయితే ఇందులో చిరు లుంగీ కట్టడం విశేషం. చూడబోతే సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని, ఫ్యాన్స్ కి చాలా ఏళ్ల తర్వాత అసలైన మాస్ మూవీని చిరు అందించబోతున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నాలుగు సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఆయన నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. దీంతోపాటు `గాఢ్ ఫాదర్` చిత్రాన్ని మోహన్రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఆమె షూటింగ్లో జాయిన్ అయ్యింది. మరోవైపు మెహర్ రమేష్తో `భోళాశంకర్` సినిమా చేస్తున్నారు చిరు. ఇందులో ఆయనకు చెల్లిగా కీర్తిసురేష్, హీరోయిన్గా తమన్నా నటిస్తుంది.
మరోవైపు శృతి హాసన్ సైతం భారీ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె సైతం రీ ఎంట్రీ ఇస్తూ `క్రాక్`తో హిట్ కొట్టింది. ఆ తర్వాత పవన్తో `వకీల్సాబ్`లో నటించి మరో హిట్ని అందుకుంది. ఇప్పుడు ప్రభాస్తో `సలార్` సినిమా చేస్తుంది. అలాగే బాలయ్యతో `ఎన్బీకే 107` సినిమా చేస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. దీంతోపాటు ఇప్పుడు చిరంజీవితో జోడీ కట్టడం విశేషంగా చెప్పొచ్చు. సీనియర్లకి శృతి బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుందని చెప్పాలి.