Latest Videos

ప్రళయాన్ని ఢీ కొట్టబోతున్న ఓంకార్‌ తమ్ముడు.. `శివం భజే` టీజర్‌ ఎలా ఉందంటే?

By Aithagoni RajuFirst Published Jun 19, 2024, 10:49 PM IST
Highlights

ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు `శివం భజే` వంటి పవర్‌ఫుల్‌ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. 
 

స్టార్‌ యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్‌ ఓ వైపు తన టీవీ షోస్‌తో, దర్శకుడిగా రాణిస్తున్నాడు. మరోవైపు తన తమ్ముడు అశ్విన్‌ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య `హిడింబా` అనే చిత్రంతో వచ్చాడు అశ్విన్‌ బాబు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మరో భారీ చిత్రంతో వస్తున్నాడు. `శివం భజే` అనే సినిమాలో నటిస్తున్నారు. సస్పెన్స్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఆథ్యాత్మిక అంశాలకు, థ్రిల్లర్‌ని అంశాలను జోడించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అప్సర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. 

ఈ మూవీ టీజర్‌ బుధవారం విడుదలైంది. టీజర్‌లో హీరో అశ్విన్‌ ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకు విచిత్రమైన కలలువస్తున్నాయి. ఏదో మత్తు ఆవహిస్తున్నట్టు, తలంతా తిరుగుతున్నట్టు అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలియడం లేదు. వరుసగా క్రైమ్‌ జరుగుతుండగా, ఇన్వెస్టిగేషన్ లో బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీన వంటి పలువురు నటులు నిమగ్నమై ఉంటారు. ఈ క్రమంలో అయ్యప్ప శర్మ .. నీ వెనుక దైవం ఉందని, ఆ సామినే నీ ద్వారా శతృ వినాశనం చేస్తున్నాడని చెప్పడంతో అశ్విన్‌బాబు ప్రత్యర్థులపై విరుకుపడటం, ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ఎపిసోడ్స్ గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజర్‌ కొత్తగా, ఆసక్తికరంగా, అదిరిపోయేలా ఉంది. చివర్లో అశ్విన్ బాబు రౌద్ర రూపంలో రౌడీలను శూలంతో ఎత్తి పడేయడం, అన్నిటినీ మించి సీజీ విజువల్స్ లో దాచిన శివుడి దర్శనం, దానికి వికాస్ బడిస బ్యాగ్రౌండ్ స్కోర్ వాహ్‌ అనేలా ఉంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో ఈ మూవీని తెరకెక్కించాం. కొత్త కథ, కథనాలకి తగ్గట్టుగా నటులు, సాంకేతిక విలువలు సమకూర్చుకున్నాము.  టైటిల్, ఫస్ట్ లుక్ కి మించిన స్పందన ఇప్పుడు టీజర్ కి రావడం చాలా ధైర్యన్నిస్తుంది. మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్ కూడా ఈ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర నిర్మాణాంతర కర్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకుని జులైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా సంతోషంగా ఉంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం` అని అన్నారు.

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, `శివం భజే` టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించిన మా చిత్ర టీజర్ కి అన్ని భాషల ప్రేక్షకులు, వీక్షకుల నుండి అనూహ్యమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి గారి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది. మా పాటలు, ట్రైలర్, విడుదల తేదీ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, "మా 'శివం భజే' టీజర్ కి వచ్చే అనూహ్య స్పందనకి అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా సస్పెన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు డివోషన్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. మా దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి గారు ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అన్నారు. దిగంగనా సూర్యవంశీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.
 

click me!