విషాదం.. షూటింగ్ లొకేషన్ లో సీనియర్ నటుడు ఖలీద్ మృతి.. వాష్ రూమ్ కి వెళ్లి కుప్పకూలిన వైనం..

By team teluguFirst Published Jun 24, 2022, 5:42 PM IST
Highlights

మలయాళీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు వీపీ ఖలీద్(70) శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ వార్తని కేరళ చలనచిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

మలయాళీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు వీపీ ఖలీద్(70) శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ వార్తని కేరళ చలనచిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఖలీద్ రంగస్థల నటుడిగా ఎంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత సినిమాల్లో, టివి సీరియల్స్ లో కూడా పాపులర్ అయ్యారు. 

ఖలీద్ మృతితో మలయాళీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. ఖలీద్ తాను నటించిన లేటెస్ట్ మూవీ షూటింగ్ లొకేషన్ లోనే కుప్ప కూలినట్లు తెలుస్తోంది. జాడే ఆంటోని జోసెఫ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 

టైమ్ ప్రకారం ఖలీద్ శుక్రవారం ఉదయం షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. వైకోమ్ అనే పట్టణంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడే ఖలీద్ బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకున్నారు. అనంతరం వాష్ రూమ్ కి వెళ్లారు. చాలా సేపటికి కూడా ఖలీద్ వాష్ రూమ్ నుంచి బయటకి రాలేదు. 

దీనితో అనుమానం వచ్చి సిబ్బంది వెళ్లి చూడగా.. ఆయన అక్కడే పడిపోయి అపస్మారక స్థితిలో కనిపించారు. దీనితో చిత్ర యూనిట్ ఖలీద్ ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఖలీద్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగా ఖలీద్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

దీనితో చిత్ర యూనిట్ మొత్తం షాక్ లోకి వెళ్ళింది. కుటుంబ సభ్యులలో విషాదం నెలకొంది. స్నేహితులు సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఖలీద్ నటిస్తున్న ఈ చిత్రం.. సూపర్ హీరోగా గుర్తింపు పొందిన మిన్నల్ మురళి ఫేమ్ టీవీనో థామస్ నటిస్తున్న చిత్రమే. 

వీపీ ఖలీద్ కి ముగ్గురు కుమారులు సంతానం. శైజు, జింశి, అలాగే దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ ముగ్గురూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ఖలీద్ మృతికి అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

click me!