మరో వివాదంలో దాసరి అరుణ్‌.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు..

By Aithagoni RajuFirst Published Aug 18, 2021, 9:28 AM IST
Highlights

దాసరి అరుణ్‌పై మరో కేసు నమోదైంది. తనని కులం పేరుతో దూషించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాసరి అరుణ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. 

దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే ఆస్తుల విషయంలో అన్న ప్రభుతో ఆయనకు మధ్య వివాదాలు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదైంది. తనని కులం పేరుతో దూషించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాసరి అరుణ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. 

దీనిపై పోలీసులు చెబుతూ, బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ అనే టెన్నీషియన్‌ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్‌ ఔట్‌ సోర్సింగ్‌ పనులు చూసేవారట. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌కి బాగా పరిచయం. 2018 నవంబర్‌ 15న దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒప్పందంపై తాను సంతకం చేయలేదని అరుణ్‌ చెప్పారు. 

ఇదే విషయంపై ఈ నెల 13, రాత్రి 9 గంటల సమయంలో తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీకి రమ్మని అరుణ్‌ చెప్పగా, చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకుని వెళ్లానని బాధితుడు తెలిపారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే అరుణ్‌కుమార్‌ కులం పేరుతో తనను దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 16న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

click me!