
సూపర్ స్టార్ రజనీకాంత్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న '2.0' చిత్రం ఆడియో వేడుక ఈ నెల 27న దుబాయ్లో గ్రాండ్గా జరుగబోతోంది. రూ. 450 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.
దుబాయ్లో నిర్వహించబోతున్న '2.0' ఆడియో రిలీజ్ వేడుక కోసం రూ. 12 నుండి 15 కోట్ల ఖర్చుతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వద్ద జరుగనున్న ఈ వేడుకకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆల్రెడీ ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్లో రిలీజ్ అయ్యాయి.
దుబాయ్లో శుక్రవారం సాయంత్రం జరుగనున్న 2.0 ఆడియో వేడుక కోసం సభావేదిక సిద్ధం అవుతోంది. హాలీవుడ్ పాప్ స్టార్స్ నిర్వహించే మ్యూజిక్ ఈవెంట్స్ స్థాయిలో ఈ వేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్... ఆడియో లాంచ్ ఈవెంట్ లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. గ్రాండ్గా జరుగబోతున్న ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కు ఇండియాతో పాటు, విదేశాల్లో నివాసం ఉంటున్న రజనీకాంత్ అభిమానులు భారీగా తరలిరానున్నారు.
ఈ వేడుకలో పాల్గొనే వారికోసం ప్రత్యేకంగా పాసులు ఇష్యూ చేశారు. సాధారణ పాసులు వేలల్లో, వీఐపీ పాసులు రూ. లక్షల్లో ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ అభిమానులు ఖర్చును లెక్క చేయకుండా భారీ రేటుకు ఈ పాసులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
3డి ఎఫెక్టులతో ఈ సినిమా భారతీయ సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. ఇండియాలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 3డి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి త్రీడీ మేకింగ్ వీడియోను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ - ''రజనీకాంత్గారితో శంకర్గారు చేస్తున్న మరో అద్భుతమైన చిత్రమిది. ఈనెల 27న దుబాయ్లో ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశాం'' అన్నారు.