కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, నటించిన 'కుబేర' సినిమా విడుదలకు ముందే కోట్ల రూపాయలు సంపాదించింది. డిజిటల్ హక్కుల అమ్మకం ద్వారా ఈ కలెక్షన్ వచ్చింది. ఈ డీల్ ద్వారా సినిమా బడ్జెట్ సగం రికవర్ అయ్యిందని సమాచారం. రణ్బీర్ కపూర్ తో 'యానిమల్', అల్లు అర్జున్ తో 'పుష్ప 2', విక్కీ కౌశల్ తో 'ఛావా' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన రష్మిక 'కుబేర'లో మొదటిసారి ధనుష్ తో కలిసి నటిస్తోంది.
'కుబేర' డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.50 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇది పెద్ద డీల్ అనే చెప్పాలి. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత, దాదాపు ఐదారు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది.
ధనుష్ కెరీర్ లో 'కుబేర' అత్యంత ఖరీదైన సినిమా అని సమాచారం. 120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ధనుష్, రష్మికతో పాటు నాగార్జున, జిమ్ సర్బ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 20 జూన్ 2025న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారు.
రష్మిక మందన్నా కెరీర్ ప్రస్తుతం మంచి ఊపు మీదుంది. ఆమె నటించిన 'సికందర్' సినిమా ప్లాప్ అయినా, 'ఛావా' మంచి విజయం సాధించింది. 'కుబేర' తర్వాత 'ద గర్ల్ ఫ్రెండ్', 'థామా' సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండతో మరోసారి కలిసి నటిస్తుంది. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది రష్మిక.